జూబ్లీహిల్స్, మే 5: నగరంలోని యశోద హాస్పిటల్స్లో అంతర్జాతీయ బ్రెస్ట్ క్యాన్సర్ సింపోజియం విజయవంతంగా జరిగింది. ఈ సింపోజియంను హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్లోని చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాఘవన్ శ్రీనివాసన్, ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటితో కలిసి ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్ సంరక్షణలో అభివృద్ధి చెందుతున్న వైద్య విధానాలు, సవాళ్లపై నిర్వహించిన ఈ సదస్సుకు మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ సర్జికల్ ఆంకాలజిస్ట్, సింపోజియం ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ చినబాబు మాట్లాడుతూ.. ఈ అంతర్జాతీయ సింపోజియం రొమ్ము క్యాన్సర్ను ఎదుర్కోవడంలో పరిశోధన, రోగ నిర్ధారణ, చికిత్స పద్ధతుల పురోగతి ప్రదర్శనకు దోహదపడినట్టు తెలిపారు. సదస్సును ఉద్దేశించి డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ..
ప్రపంచస్థాయి సేవలను అంకితభావంతో అందించడంతో పాటు రొమ్ము క్యాన్సర్పై పరిశోధన, రోగుల సంరక్షణకు ప్రదర్శిస్తున్న నిబద్ధత స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. ఈ సదస్సుకు అంతర్జాతీయ అధ్యాపకులు డాక్టర్ రెగిస్ పాలినెల్లి, డాక్టర్ రిషికేశ్ పరమేశ్వర్, జాతీయ అధ్యాపకులు డాక్టర్ చైతన్యానంద కొప్పికర్, డాక్టర నరేంద్ర హుళికల్, డాక్టర్ వాణి పర్మార్, డాక్టర్ శలాక జోషి, డాక్టర్ అశోక్ బీసీ, డాక్టర్ జ్యోతి బాజ్పాయ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈసదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ వైద్య నిపుణులు, న్యాయవాదులు, వాటాదారుల సుదీర్ఘ చర్చలు, సంచలనాత్మక పరిశోధనల ప్రదర్శనలతో క్యాన్సర్పై పోరాటంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి ఒక వేదికగా నిలిచింది. ఈ సదస్సులో 500 మందికి పైగా సర్జన్లు, గైనకాలజిస్టుల ఇంటరాక్టివ్ సెషన్లు, ప్యానెల్ చర్యలు, ఆయా రంగాల్లోని ప్రముఖుల ప్రసంగాలతో విజయవంతంగా ముగిసింది.