హైదరాబాద్: కార్తీక పౌర్ణమి పర్వదినాన హైదరాబాద్ నగరం మణికొండ పరిసరాల్లోని నెక్నాంపూర్ చెరువు రంగుల కళ సంతరించుకున్నది. ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజున హైదరాబాద్లోని ఒడియా సమాజం బొయిట బందన ఉత్సవం జరుపుకుంటుంది. ఈ సందర్భంగా అరటి కాడలతో బోట్లు తయారు చేసి, రంగురంగుల పూలు, కాగితాలతో అలంకరించి, సరస్సులో వదులుతారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఇవాళ కూడా ఒడియా సమాజం కన్నుల పండువగా బొయిట బందన ఉత్సవం జరుపుకుంటున్నది.
తమ పాతతరం వ్యాపారులను స్మరించుకోవడం కోసం ఏటా ఉత్సవం నిర్వహిస్తారు. ఈ రోజు కూడా ఉదయం 5 గంటలకే ఒడియా సమాజానికి చెందిన 50 కుటుంబాల వారు నెక్నాంపూర్ చెరువుకు చేరుకున్నారు. జగన్నాథుని ప్రతిమను నెలకొల్పి రంగురంగుల రంగోలీలు వేశారు. అరటి కాడలతో చిన్నచిన్న పడవలు తయారుచేసి, వాటిలో చిన్న నెయ్యి దీపం, చిన్న కాగడా, తమలపాకులు, పోకలు, బియ్యం, పూలు పెట్టి నీటిలో వదిలారు. ఇలా తమ పాతతరం వ్యాపారులను స్మరించుకున్నారు.
క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో కళింగ రాజ్యం (ఇప్పటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని ప్రాంతం)లో సముద్ర వ్యాపారం జోరుగా సాగేది. రాజ్యానికి చెందిన పలువురు వర్తకులు సముద్ర మార్గం గుండా ఇతర దేశాలకు వస్తువులను తీసుకెళ్లి విక్రయించేవారు. ముఖ్యంగా ఒడియా వ్యాపారులు ఇండోనేషియాలోని జావా, బోర్నియో, బాలి.. మలేషియాలోని సుమత్రా వంటి దీవులకు తమ వస్తువులను విక్రయించడానికి వెళ్లేవారు. నెలల తరబడి అక్కడే ఉండి తమ వస్తువులను విక్రయించి వచ్చేవారు. వారు కార్తీక పౌర్ణమి రోజుననే ఎక్కువగా తమ సముద్రయానం ప్రారంభించేవారు. ఈ సందర్భంగా ఆ వ్యాపారుల భార్యలు తమ భర్తలు ప్రయాణించే పడవలకు పూజలు చేసేవారు. ఆ తర్వాత సాధరంగా సాగనంపేవారు.
ఇప్పుడు పడవల్లో విదేశాలకు వెళ్లి వ్యాపారం చేసేవాళ్లు లేకపోయినా పూర్వకాలం తమ పూర్వీకులు చేసిన పనులను స్మరించుకుంటూ కార్తీక పౌర్ణమి రోజు ఉత్సవం జరుపుకుంటున్నారు. హైదరాబాద్లోని ఒడియా సమాజానికి చెందినవారు కూడా ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజు బొయిట బందన ఉత్సవం నిర్వహించుకుంటున్నారు. గతంలో అయితే తప్పనిసరిగా అరటి కాడలతోనే పడవలు చేసేవారు. కానీ ఇప్పుడు అరటి కాడలు దొరకకపోతే వాటి బదులుగా కార్డ్బోర్డు, కాగితం, వస్త్రం వంటి వాటిని కూడా వినియోగిస్తున్నారు. కాగా, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుడు సముద్ర వ్యాపారం కోసం కళింగపై కన్నేసి దండయాత్ర చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.