ఓ పక్క కరోనా భయం వెంటాడుతుండగా.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ టెన్షన్ పట్టుకున్నది. కరోనా సోకి తగ్గిన వారు, ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న వారిలో కొందరు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. వీరికి ప్రభుత్వం ప్రత్యేకంగా కోఠి ఈఎన్టీ ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నది. అయితే ఫంగస్ లేకున్నా స్వల్ప లక్షణాలు కనిపిస్తే చాలు..బ్లాక్ ఫంగస్ బారిన పడ్డామనే భయంతో దవాఖానకు పరుగులు పెడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తొలుత ప్రైవేటు ఆస్పత్రులకెళ్లి అక్కడ వైద్యుడు అనుమానం వ్యక్తం చేసినందున ఆస్పత్రిలో చేర్చుకోవాలంటూ వైద్యులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఫలితంగా వారికి సర్దిచెప్పి అదనపు పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందని ఈఎన్టీ వైద్యులు చెబుతున్నారు.
బ్లాక్ ఫంగస్ నోడల్ కేంద్రంగా ప్రకటించినప్పటి నుంచి కోఠి ఈఎన్టీకి అనుమానితుల రాక అధికమవుతోంది. ఇక్కడికి కనీసంగా 250-300 మంది వరకు ప్రతినిత్యం వస్తున్నారు. వీరిలో కంటి, చెవి, ముక్కు సమస్యలతోపాటు ప్రధానంగా బ్లాక్ ఫంగస్ అనుమానితులు అధికంగా కనిపిస్తున్నారు. బుధవారం వరకు కోఠి ఈఎన్టీకి 1325 మంది బ్లాక్ ఫంగస్ అనుమానితులు రాగా, 351 మందికి మాత్రమే బ్లాక్ ఫంగస్ నిర్ధారణ జరిగిందని, వీరికి శస్త్రచికిత్సలు చేసి ఫంగస్ను నియంత్రణలోకి తెచ్చేందుకు సేవలు అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే చాలామంది కోలుకొని ఇండ్లకు వెళ్లిపోయారు. అయితే బ్లాక్ ఫంగస్ అనుమానం తో వచ్చిన వారి సంఖ్య గణనీయంగా ఉంటుండడం వైద్యులకు సవాలుగా మారింది. ఇప్పటివరకు ఏకంగా 974 మంది అంటే 74 శాతం మంది అనుమానతోనే వైద్యుల్ని సంప్రదించారు.
కోఠి ఈఎన్టీలో బ్లాక్ ఫంగస్ రోగుల్ని పరీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇద్దరు అసిస్టెంటు ప్రొఫెసర్లు, నలుగురు పీజీలు పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించి, బ్లాక్ ఫంగస్ ఉందా? లేదా? అని నిర్ధారిస్తారు. ఒకవేళ ఫంగస్ ఉన్నట్లు అనుమానం వస్తే సీనియర్ ప్రొఫెసర్ల దృష్టికి తీసుకువెళతారు. వారు నిర్ధారించిన తర్వాతే ఆస్పత్రిలో అడ్మిషన్ ఇస్తారు. అయితే కొన్నిరోజులుగా ఓపీకి వచ్చిన వారిలో ఫంగస్ లేనివారే దాదాపు నాల్గింట ఒక వంతు ఉన్నారు. ఇందులోనూ అత్యధికమంది సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్న వారే ఉంటున్నారు. ప్రధానంగా చాలాకాలంగా సైనస్ సమస్య ఉండి కరోనా బారిన పడిన వారు అనేకమంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించడం…లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన సైనస్ బాధితులను బ్లాక్ ఫంగస్ అనుమానితులుగా వైద్యులు తేల్చడంతో వారంతా కోఠి ఈఎన్టీకి వస్తున్నట్లు వైద్యుడు ఒకరు తెలిపారు. అయితే ఫంగస్ లేదని చెప్పినా కొందరు ఆస్పత్రిలో చేర్చుకోమని మొండికేస్తున్నారని వాపోయారు.
బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారిలో తొలిదశలోనే ప్రధానంగా ముక్కు,సైనస్లో ఉన్నప్పుడే సర్జరీ ద్వారా తొలగించేందుకు కృషి చేస్తున్నాం. ఫంగస్ కన్ను, మెదడుకు వ్యాప్తి చెందకుండా ముక్కులోనే తుద ముట్టించేందుకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నాం. దవాఖానలోని నాలుగు యూనిట్ల వారీగా నలుగురు ప్రొఫెసర్లు,అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు,నర్సులు, వైద్య సిబ్బందితో నిరంతరం శ్రమిస్తున్నాం. -డాక్టర్ శంకర్, దవాఖాన సూపరింటెండెంట్
సుల్తాన్బజార్, జూన్ 3 : బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్న 74 మంది గురువారం కోఠి ఈఎన్టీ దవాఖానకు రాగా వైద్యులు పరీక్షించి 30 మందికి అడ్మిషన్ ఇచ్చారు. దవాఖానలో చికిత్స పొందుతున్న 30 మంది రోగులకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఇదిలా ఉండగా బ్లాక్ ఫంగస్ అనుమానంతో వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించి వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు ఐదురోజులకు సరిపడా మందులిచ్చి ఇంటికి పంపుతున్నారు.