“బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే. ఈ తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధి ఏమీ జరగలేదు. మేం తెలంగాణ అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు అందించాం. ప్రజలంతా కమలం వైపునే చూస్తున్నారు. వచ్చే ప్రభుత్వం బీజేపీదే.”.. అని ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీతో సహా.. మరోవైపు హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. ఇంకోవైపు పియూష్ గోయల్ ఇలా అనేక దిగ్గజ కేంద్ర మంత్రులు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బహిరంగ సభలు నిర్వహించి ఊకదంపుడు ఉపన్యాసాలు దంచికొడుతున్నారు. తెలంగాణను బీజేపీ ఖాతాలో వేసుకోవడం ఖాయమని వేదికలపై గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): కమలానికి ఓటమి భయం పట్టుకున్నది. ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగడానికి జంకుతున్నది. ప్రజల్లో బీఆర్ఎస్కు వస్తున్న అనూహ్య స్పందనకు రాష్ట్ర, జాతీయ నాయకుల వరకు వణుకు పట్టుకున్నది. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు అంతా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైనప్పటికీ ఓటర్లను బీఆర్ఎస్ నుంచి మళ్లించడం కష్టమని వారికి అర్థమయ్యింది. అధికార పార్టీని ఢీకొట్టడమంటే ఆషా మాషీ కాదని జాతీయ పార్టీకి బోధపడింది. అందుకే ఎన్నికల్లో పొత్తు రాజకీయాలకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే మొన్న టీడీపీ నారా లోకేశ్ను అమిత్ షాతో కలిపించిన కిషన్ రెడ్డి.. తాజాగా జనసేన అధినేత పవణ్ కల్యాణ్ను కలవడం హాట్ టాపిక్గా మారింది. పవన్ కూడా పొత్తుకు అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అటు టీడీపీ.. ఇటు జనసేన పొత్తు అంశం మరో రెండు రోజుల్లో కొలిక్కిరానున్నదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచేల అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలా ఎన్నో పథకాలను అమలు చేశారు. తొలుత వీటిని చాలా మంది సాధ్యం కానివని ఎద్దేవ చేశారు. జాతీయ పార్టీ నాయకులు సైతం విమర్షలు చేశారు. కానీ కేసీఆర్ పెద్ద మనసుతో అభివృద్ధి వ్యూహాలతో వాటిని సాధ్యం చేసి తెలంగాణ ప్రజల మన్ననలు పొందారు. ఇప్పుడు అవే పథకాలను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్లు మార్చి పెట్టుకుంటున్నారు. దేశమంతా ఇవన్నీ కేసీఆర్ పథకాలలాగే ఉన్నాయని చర్చించుకుంటున్నారు. దటీజ్ కేసీఆర్ అని కొనియాడుతున్నారు. దేశవ్యాప్తంగా కేసీఆర్కు ఉన్న ఆదరణను చూసి కమలం పార్టీ బెంబేలెత్తిపోతున్నది. అందుకే ఏం అభివృద్ధి చేస్తామో చెప్పకుండా.. కేవలం సీఎంపై విమర్షలకే జాతీయ నాయకులు పరిమితమవడంపై ప్రజలకు విశ్వాసం లేకుండా పోయింది. సర్వేలో సైతం కేసీఆర్ను బీజేపీ ఢీకొట్టలేదని కమలం పెద్దలకు వెల్లడైంది. దీంతో వారంతా పొత్తుల బాటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకే పొత్తు రాజకీయాల్లో బీజేపీ మునిగిపోయింది.
బీజేపీ పొత్తు రాజకీయాలపై సొంత పార్టీ నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్లో కుత్బుల్లాపూర్, సనత్నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ తదితర నియోజకవర్గాల్లో బీజేపీ, టీడీపీ, జనసేనలు వేర్వేరుగా బరిలో ఉండేందుకు ఆ పార్టీలో ఏండ్లుగా పనిచేస్తున్న ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. పొత్తు కుదిరితే నియోజకవర్గాల్లో సంబంధిత పార్టీ అభ్యర్థులు ఎవ్వరో ఒక్కరూ సీటు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియపై ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకే సమన్యాయం పాటించే అధికార పార్టీయే బెటర్ అని విరివిగా గులాబీ కండువా కప్పుకుంటున్నారు. పొత్తు కుదిరితే ఇప్పటికే తమ అనుచరులను జాబితాలో చేర్చాలనుకున్న వ్యక్తుల పేర్లు కూడా మాయమయ్యే పరిస్థితులుంటాయని బీజేపీలోని ఓ వర్గం కలవరపడుతున్నది. మరోవైపు ఒంటరిగా వెళ్లినా.. పొత్తుతో వెళ్లినా గెలిచేది లేదు.. వచ్చేది లేదని ఆ పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు.