హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని గప్పాలు కొడుతున్న బీజేపీ (BJP) అభ్యర్థులు దొరక్క ఆపసోపాలుపడుతున్నది. ఉన్నవారు జారిపోకుండా చూస్తూనే అభ్యర్థులు లేనిచోట పక్కపార్టీల నుంచి చేర్చుకుని వారికి టికెట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. రేపోమాపో ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లోని గోషామహల్ (Goshamahal) నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని వెతుకులాడటం ఎందుకు అనుకున్నారో ఏమో.. ప్రస్తుత ఎమ్మెల్యే రాజాసింగ్పై (Raja Singh) ఉన్న సస్పెన్షన్ను (Suspension) పార్టీ నాయకత్వం ఎత్తివేసింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడనే కారణంతో గతేడాది ఆగస్టు 23న ఆయనపై పార్టీ అధిష్ఠానం బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే.
అయితే ఆయన నుంచి పార్టీ నాయకత్వం వివరణ కోరింది. దీంతో రాజాసింగ్ ఇచ్చిన వివరణపట్ల సంతృత్పిని వ్యక్తంచేసిన క్రమశిక్షణా కమిటీ.. సస్పెన్స్ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అయితే ఏడాదికిపైగా తాత్సారం చేసిన పార్టీ అధిష్ఠానం తీరా ఎన్నికల సమీపంలో ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయడం గమనార్హం.