శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 20 : ప్లాట్లు కొనుగోలు చేసిన మహిళలపై దాడి చేసి, 7.20 ఎకరాల భూమిని కబ్జాకు యత్నించిన బీజేపీ నాయకులను రిమాండ్కు తరలించినట్లు శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్రావు తెలిపారు. మంగళవారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… శంషాబాద్ మండలంలోని చౌదర్గూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని కే ఎంఆర్ఆర్ వెంచర్ పేరుతో డాక్టర్ కాలనీ ఫేజ్-3ని ప్లాట్లుగా చేసి అమ్మేశారు. వాటిని కొనుగోలు చేసిన 30 నుంచి 40 మంది సోమవారం అక్కడికి వచ్చారు. అప్పటికే బీజేపీ నాయకులు ప్లాట్ల చుట్టూ ఉన్న కడీలు, ప్రీకాస్ట్ను ధ్వంసం చేస్తుండగా వారిని అడ్డుకున్నారు.
ఈ గొడవలో మహిళలపై బీజేపీ నాయకులు అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోలు తీశారు. అలాగే వారి ఫోన్లు లాక్కొన్నారు. దీంతో బాధితులు 100కు కాల్ చేశారు. సీఐ శ్రీనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులపై దాడి చేసిన బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. ఈ ప్లాట్ల కబ్జాకు గతంలోనూ బీజేపీ నాయకులు యత్నించినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కబ్జాకు యత్నించిన అయ్యూబ్, మలచలం మోహన్రావు, ఎం. కుమార్, నానవాల కుమార్యాదవ్, మన్నె ప్రవీణ్, మామిళ్ల మల్లేశ్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.