గోల్నాక, మే 27 : అంబర్పేట నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి కీలక నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా శనివారం అంబర్పేట డివిజన్ పటేల్నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక సీనియర్ బీజేపీ నాయకుడు కూన కుమారస్వామితోపాటు సుమారు వంద మంది బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిని అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఓ వైపు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. మరోవైపు అంబర్పేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీతోపాటు ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో పెద్దఎత్తున చేరుతున్నారని అన్నారు.
అప్పటి పాలకుల నిర్లక్ష్యం వల్ల గత 15ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గం కేవలం నాలుగేండ్ల వ్యవధిలో అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఆయన చెప్పారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల లబ్ధిదారులకు అందజేయడంతో పాటు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకునేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని తెలిపారు. పార్టీలో కష్టపడే ప్రతి నాయకుడికి తగిన ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్తో పాటు పెద్దఎత్తున బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.