నాంపల్లి పీఎస్లో 2018లోనే కేసు నమోదు
టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు సత్యంచారి, రాజిరెడ్డి ధ్వజం
వనస్థలిపురం, జూలై 6: భూ కబ్జాలు, ఫోర్జరీలకు మారు పేరు బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అని టీఆర్ఎస్ హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యం చారి, చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజిరెడ్డి అన్నారు. బుధవారం హస్తినాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఓ ప్రాజెక్టులో ఫోర్జరీకి పాల్పడినట్లు 2018లో నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. ఆ కేసు ఎఫ్ఐఆర్ కాపీని మీడియాకు అందజేశారు. తన భాగస్వామిగా ఉండి తననే మోసం చేశాడని లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
రంగారెడ్డి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మచ్చలేని నాయకుడు, ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. సుర్యుడికంటే ముందే ప్రజల్లోకి వస్తూ.. నిత్యం ప్రజల్లోనే ఉండే నాయకుడు సుధీర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కోట్లాదిగా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారన్నారు. గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు నామమాత్రంగా మిగిలిపోయారన్నారు. అబద్దాల రాజకీయాలను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాన్ని ఒక మోడల్గా నిర్మించేందుకు శ్రమిస్తున్న నాయకుడికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సుధీర్రెడ్డిపైన విమర్శలు చేసిన నాయకులుగా ఎదగాలనుకునేవారికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమావత్ శ్రీనూనాయక్, నారబోయిన శ్రీనివాస్యాదవ్, నాగిరెడ్డి, విజయ్కుమార్, శ్రీరాములుగౌడ్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.