బడంగ్పేట, ఆగస్టు4: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ కో సభ్యులు, వికారాబాద్ బీజేపీ కో ఇన్చార్జి పెద్దబావి నాగ నందీశ్వర్రెడ్డి, పెద్దబావి సమరసింహారెడ్డి, హరికృష్ణారెడ్డి, శ్రీకర్ భరద్వాజ్, శైలేందర్ రెడ్డి, శ్రీశైలం, శ్రీకర్, శరత్, సిద్ధార్థ తదితరులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా భావించి పనిచేస్తున్నామని తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడం ద్వారానే చాలా మంది ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం కులం, మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నదని మంత్రి ఆరోపించారు. బీజేపీ మాటలకు.. చేతలకు పొంతనే లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. బడంగ్పేట, వెంకటాపూర్, నాదర్గుల్కు చెందిన బీజేపీ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
క్యాడర్లో తీవ్ర అసంతృప్తి
– నాగ నందీశ్వర్ రెడ్డి
మహేశ్వరం నియోజకవర్గం బీజేపీలో ఎవరికి వారే.. యమునా తీరే.. అన్నట్లుగా ఉన్నదని పెద్దబావి నాగ నందీశ్వర్రెడ్డి అన్నారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, వికారాబాద్ జిల్లా కో ఇన్చార్జిగా పనిచేశానని తెలిపారు. బీజేపీలో కింధ స్థాయి కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ నాయకుల గ్రూపు రాజకీయాలతో విసుగు చెంది రాజీనామా చేసినట్లు తెలిపారు. తనతో పాటు ఇంకా చాలా మంది బీజేపీ పార్టీని వీడుతున్నారని చెప్పారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్ సూర్ణగంటి అర్జున్, కో ఆప్షన్ సభ్యుడు మర్రి జగన్ మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పెద్ద బావి ఆనంద్ రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, పుట్టగల్ల సంతోష్ కుమార్, సిల్వేరు సాంబ శివ తదితరులు ఉన్నారు.