సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): అప్పుడేమో కౌలు రైతులకు సహాయం చేస్తామంటూ.. మహిళపై లైంగిక వేధింపులు.. కటకటాలపాలు. ఇప్పుడు ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా వేసి మరోసారి కటకటాల్లోకి.. ఇది ఓ బీజేపీ నాయకుడి ఘన చరిత్ర. ఉద్యోగాల ముసుగులో నిరుద్యోగులకు లక్షల రూపాయలు టోకరా వేస్తూ పోలీసులకు చిక్కాడు. నగరంలోని కొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నగర సైబర్క్రైమ్ పోలీసులు, నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు. శనివారం బషీర్బాగ్లోని పాత కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబర్క్రైమ్ డీసీపీ స్నేహ మెహ్రా, టాస్క్ఫోర్స్ డీసీపీ పి.రాధాకృష్ణారావుతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు.
సిద్దిపేట జిల్లాకు చెందిన గడగోని చక్రధర్గౌడ్ ప్రస్తుతం నగరంలోని బాచుపల్లి, ప్రగతినగర్లో నివాసముంటున్నాడు. 2005 నుంచి 2008 మధ్యకాలంలో సిద్ధిపేటలో డిగ్రీ పూర్తిచేసిన చక్రధర్ గౌడ్ 2008 నుంచి 2009 వరకు సంవత్సర కాలంపాటు నగరంలోని ఎల్ఐసీ అబిడ్స్ శాఖలో పర్సనల్ లోన్స్ ఇప్పించే ఏజెంట్గా పనిచేశాడు. అనంతరం హిమాయత్నగర్లోని కొటక్ మహింద్రా బ్యాంక్, జీఈ మనీ తదితర సంస్థల్లో 2011వరకు పనిచేశాడు. తరువాత సాకెట్లో సంవత్సర కాలంపాటు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు.
ఆ తరువాత కొంత కాలం రియల్టర్గా కూడా పనిచేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించారు. అయితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని కాల్సెంటర్ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పంజాగుట్టలో నెలకు రూ.1.30లక్షల అద్దెతో ఒక విశాలమైన ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అదే సమయంలో తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల నుంచి టెలికాలర్స్ను నియమించుకున్నాడు. వారికి రూ.15వేల జీతంతో పాటు భోజనం, బస చేసేందుకు వసతి సదుపాయం కూడా కల్పించడంతో ఇతడి వద్ద ఉద్యోగం చేసేందుకు ఆయా రాష్ర్టాల నుంచి నిరుద్యోగులు పెద్ద సంఖ్యలోనే చేరారు. ఈ క్రమంలో చక్రధర్గౌడ్ తన బావమరిది గణేశ్, శ్రవణ్లతో కలిసి పంజాగుట్టలోని అద్దె ఇంట్లో పెద్ద ఎత్తున కాల్సెంటర్ను ప్రారంభించాడు. ఆయా రాష్ర్టాల నుంచి వచ్చిన 11మంది మహిళలతో సహా మొత్తం 32 మంది టెలికాలర్స్ను ఈ సెంటర్లో నియమించాడు.
టెలికాలర్స్ కోసం జగదీష్ మార్కెట్ నుంచి 146 సెల్ఫోన్స్ను కొనుగోలు చేశాడు. వాటిలో కొన్నింటిని తన సంస్థలో పనిచేస్తున్న టెలికాలర్స్కు అందజేశాడు. అంతే కాకుండా అనంతపురంలోని కృష్ణమూర్తి అనే వ్యక్తి వద్ద వెయ్యి రూపాయలకు ఒకటి చొప్పున సిమ్కార్డులను కొనుగోలు చేసి టెలికాలర్స్కు అందజేసిన సెల్ఫోన్లలో వేయించాడు. అంతేకాకుండా ప్రతి సిమ్కార్డుకు బ్యాంక్ ఖాతాను లింకు చేయించాడు.
టెలికాలర్స్ ద్వారా నిరుద్యోగులకు ఫోన్లు, మెసేజ్లు చేయించి తమ వద్ద డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయని, ఇంటి వద్ద నుంచే నెలకు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు సంపాదించవచ్చని నమ్మబలికేవాడు. టెలికాలర్స్ మాటలు నమ్మి జాబ్లో చేరిన నిరుద్యోగులకు కొన్ని జెపీజీ ఫైల్స్ను అప్పజెప్పి, వాటిని పీడీఎఫ్కు మార్చాలని సూచించేవారు. ఈ క్రమంలో బాధితులు నెల రోజుల పాటు టెలికాలర్స్ పంపిన జేపీజీ ఫైల్స్ను పీడీఎఫ్కు మార్చిన తరువాత తమ వేతనాలు ఇవ్వాలని కోరేవారు. అయితే రూ.25వేల జీతం కావాలంటే తమ కమీషన్ కింద రూ.2500 ముందుగా చెల్లించాలని టెలికాలర్స్ బాధితులకు సూచించేవారు.
అది నమ్మిన బాధితులు ఆన్లైన్ ద్వారా రూ.2500 చెల్లించిన వెంటనే వారి నంబర్లను టెలికాలర్స్ బ్లాక్ చేసేవారు. అయితే చిన్న మొత్తం కావడంతో బాధితులు సైతం దీనిపై ఫిర్యాదు చేయడానికి పెద్దగా ముందుకు రాలేదు. ఈ క్రమంలో నిందితులు 45రోజుల పాటు నిరుద్యోగులను దోచుకుని 45రోజుల తరువాత తమ బిచాణా ఎత్తేసేవారు. అంతే కాకుండా అప్పటి వరకు వినియోగించిన సిమ్కార్డులను ధ్వంసం చేసి కొత్త సిమ్కార్డులను వాడేవారు. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలోనే సుమారు రూ.50లక్షల వరకు నిరుద్యోగుల నుంచి అక్రమంగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, తమిళనాడులోని దాదాపు 1900మంది నిరుద్యోగులు ఈ నకిలీ కాల్సెంటర్ బారిన పడి మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు.
ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.2500 చొప్పున వసూలు చేయడంతో చాలా మంది బాధితులు చిన్న మొత్తం డబ్బు కోసం ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. దీనిని ఆసరాగా చేసుకుని నిందితులు వేల సంఖ్యలో నిరుద్యోగులను మోసగిస్తూ లక్షలు దండుకుంటున్నారు. ఈ క్రమంలోనే నగరానికి చెందిన ఇద్దరు నిరుద్యోగులు చక్రధర్గౌడ్ చేతిలో మోసపోయి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబర్క్రైమ్ పోలీసులు టాస్క్ఫోర్స్ పోలీసుల సహకారంతో శనివారం పంజాగుట్టలోని నకిలీ కాల్సెంటర్పై దాడులు జరిపారు.
ఈ దాడుల్లో ప్రధాన నిందితుడైన చక్రధర్గౌడ్, గణేశ్, శ్రావణ్లతో పాటు 32మంది టెలికాలర్స్ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 14 ల్యాప్టాప్లు, 148 సెల్ఫోన్స్, రూ.1,03,500 నగదుతో నాలుగు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన చక్రధర్ గౌడ్పై గతంలో కూడా పలు కేసులున్నట్లు తెలుస్తోందని, అయితే కస్టడీలోకి తీసుకుని విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. సైబర్క్రైమ్ డీసీపీ స్నేహ మెహ్రా, టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణారావు పర్యవేక్షణలో జరిగిన ఈ దాడుల్లో నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు టి.శ్రీనాథ్రెడ్డి, ఆర్.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాల పేరుతో కాల్సెంటర్ నిర్వహిస్తూ నిరుద్యోగులను మోసగిస్తున్న ప్రధాన నిందితుడైన చక్రధర్గౌడ్ బీజేపీకి చెందిన నాయకుడు కావడం గమనార్హం. అంతే కాకుండా గతంలో కూడా అతడిపై పలు కేసులు నమోదై ఉన్నట్లు తెలుస్తోంది. కాగా స్నేహితుడి భార్యనే లైంగికంగా వేధించడంతో బాధితురాలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ కేసులో గత ఫిబ్రవరి నెలలో శామీర్పేట పోలీసులు నిందితుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కౌలు రైతులకు సహాయం చేస్తామంటూ మహిళలను లోబర్చుకోవడం, ముగ్గుల పోటీల పేరుతో వారిని ముగ్గులోకి దింపేందుకు యత్నించినట్లు కూడా చక్రధర్గౌడ్పై పలు ఆరోపణలున్నాయి. అంతే కాకుండా సిద్దిపేట నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ కూడా నిందితులు ప్రచారం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. పలు నేరాలకు పాల్పడుతున్న చక్రధర్గౌడ్కు బీజేపీ బడా నాయకులతో సత్సంబంధాలున్నాయనడానికి ఆ పార్టీకి చెందిన ఈటల, రఘునందన్రావు తదితరులతో కలిసి దిగిన ఫొటోలే నిదర్శనం.