కౌన్సిల్ హాల్లో బరితెగించిన బీజేపీ కార్పొరేటర్లు
మేయర్పై అనుచిత వ్యాఖ్యలు
పవిత్ర స్థలంలో పరుష పదజాలంతో దౌర్జన్యం
టీఆర్ఎస్ కార్పొరేటర్ గల్లా పట్టుకున్న బీజేపీ కార్పొరేటర్
గట్టిగా బదులిచ్చిన టీఆర్ఎస్
బల్దియా సమావేశంలోకి తొలిసారి మార్షల్స్
మొన్నటి బ్లాక్ స్ప్రే మరువకముందే మరో కాషాయ మరక
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన స్థలంలో బూతులు తిట్టారు. సాటి సభ్యురాలు, నగర ప్రథమ పౌరురాలు అని కూడా చూడకుండా ‘దమ్ముంటే.. ధైర్యముంటే’ అంటూ పరుష పదాలు వాడారు. రెచ్చిపోయి టీఆర్ఎస్ కార్పొరేటర్ల గల్లాలు పట్టుకొని.. మైకులు విరగ్గొట్టారు. గతంలో బాధ్యత మరిచి జీహెచ్ఎంసీ లోగోపై బ్లాక్ స్ప్రే చేసిన కమలం కార్పొరేటర్లు.. ఇప్పుడు బల్దియా సమావేశంలోనే రణరంగం సృష్టించారు. అభివృద్ధి గురించి పక్కన పెట్టి బీభత్సం చేశారు. దానికి టీఆర్ఎస్ కార్పొరేటర్లూ గట్టిగానే బదులిచ్చారు. కండ్లుండీ కబోదులుగా మారిన బీజేపీ కార్పొరేటర్లకు కంటి పరీక్షలు చేయిస్తామని చురకలు అంటించారు. అన్నదాతను ముంచేలా కేంద్రం వ్యవహరిస్తే.. నగరాభివృద్ధికి అడ్డుపడేలా ఇక్కడి వారు వ్యవహరించి తాము అభివృద్ధి నిరోధకులమని నిరూపించుకున్నారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యలపై చర్చించేందుకు కౌన్సిల్ను ఏర్పాటు చేయండి.. కొవిడ్ సమయంలో పదేపదే బీజేపీ కార్పొరేటర్లు చేసిన డిమాండ్ ఇది. తాజాగా మంగళవారం ఏర్పాటు చేసిన గ్రేటర్ కౌన్సిల్లో వాళ్లంతా ప్రజా సమస్యలపై చర్చించారా? గత కౌన్సిల్లో బాధ్యత మరిచి జీహెచ్ఎంసీ లోగోపై బ్లాక్ స్ప్రే చేయడంతో పాటు ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిన చరిత్ర వారిది. ఆ ధ్వంస చరిత్రను మరోసారి తిరగరాసేందుకు బీజేపీ కార్పొరేటర్లు పోటీపడ్డారు. మంగళవారం జరిగిన కౌన్సిల్లో బరితెగించి.. నోటికొచ్చినట్లు పరుష పదజాలం వాడారు. బీభత్సాన్ని సృష్టించారు. మేయర్ అంటే గ్రేటర్ ప్రథమ పౌరురాలు.. పైగా మహిళ అనే గౌరవం లేకుండా ‘దమ్ము, ధైర్యం’ అనే పదాలను వాడి నోరుపారేసుకున్నారు. గ్రేటర్ బడ్జెట్పై చర్చ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పించారు. తొలుత బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్కు మేయర్ అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఎంఐఎం పార్టీ నుంచి మాజీద్ హుస్సేన్, టీఆర్ఎస్ నుంచి మన్నె కవితా రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, కాంగ్రెస్ నుంచి ఉప్పల్ కార్పొరేటర్ రజిత బడ్జెట్ అభిప్రాయాలను వెల్లడించారు.
పరుష పదజాలంతో..
ఆ తర్వాత బీజేపీ నుంచి చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సమస్యలపై ప్రసంగిస్తూనే మధ్యలో ఒక్కసారిగా మేయర్ను ఉద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడారు. ప్రథమ పౌరురాలు, సాటి మహిళా సభ్యురాలు అనే కనీస గౌరవం లేకుండా దమ్ము, ధైర్యం ఉంటే డివిజన్లలో పర్యటించాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే మధుసూదన్ రెడ్డి మేయర్కు క్షమాపణ (సారీ) చెబుతూనే వెనువెంటనే తాగుబోతు పార్టీ కండువా వేసుకొని కౌన్సిల్లోకి వచ్చారంటూ టీఆర్ఎస్ కార్పొరేటర్లను ఉద్దేశించి అసభ్యకర భాషను వాడుతూ మాట్లాడారు. మధుసూదన్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు పోడియాన్ని స్తంభింపజేశారు. వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
రావుల గల్లా పట్టుకుని..
ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి, బీజేపీ కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. రావుల శేషగిరి గల్లాను మధుసూదన్ పట్టుకోగా, మరో బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ మైక్ను విరగొట్టాడు. ఈ సందర్భంగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్ల నినాదాలతో కౌన్సిల్ హోరెత్తింది. ఈ సందర్భంగా మేయర్ కూడా మధుసూదన్ వ్యాఖ్యలను ఖండించారు. మార్షల్ వచ్చి ఇరువురిని సర్ధి చెప్పే ప్రయత్నం చేయగా, పోటాపోటీగా స్లోగన్స్ చేయడం, వివాదం ముదురుతుండటంతో మేయర్ జోక్యం చేసుకుని సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.
సభ్యులు హుందాతనంగా వ్యవహరించాలి
తిరిగి సభ ప్రారంభం అనంతరం ఎక్స్ఆఫిషియో సభ్యులు, ఎమ్మెల్సీ ప్రభాకర్ మాట్లాడారు. పవిత్ర స్థలమైన కౌన్సిల్లో ప్రజాసమస్యలపై అర్ధవంతమైన చర్చ జరగాలని తెలిపారు. సభ్యులు హుందాతనంగా వ్యవహరించాలి. రాజకీయాలకు వేదిక కాదని అన్నారు. సభలో ఇరువురు సభ్యులు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని విన్నవించగా, మేయర్ అ భ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కాగా స్వరాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా కౌన్సిల్లోకి మార్షల్ అడుగు పెట్టారని, ఆ పరిస్థితికి బీజేపీ నేతలే కారణమయ్యారంటూ అధికారులు, పలు పార్టీల నేతలు విస్మయం వ్యక్తం చేయడం గమనార్హం.