సిటీబ్యూరో, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ): ఎన్నికల సమరంలో ‘కారు’ స్పీడ్ను పెంచింది. గడిచిన రెండు నెలలుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నియోజకవర్గాన్ని చుట్టేసిన అభ్యర్థులు జనంతో మమేకమయ్యారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందించిన అభివృద్ధిని పాశుపతాస్త్రంగా మార్చుకొని ప్రతిపక్షాలపై విజయం సాధిస్తామన్న ధీమాతో బీఆర్ఎస్ అభ్యర్థులు రెండో విడత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తొమ్మిదిన్నరేండ్ల నియోజకవర్గ ప్రగతిని కరపత్రంగా ముద్రించి కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ ఇచ్చిన హామీలను నెరవేర్చిన మా విశ్వసనీయతనే ఈ ఎన్నికల్లో తమ విజయమంత్రంగా మారుతుందని బీఆర్ఎస్ నేతలు ఈ సందర్భంగా చెబుతున్నారు. తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న ప్రజా వ్యతిరేక శక్తులకు, తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఎన్నికల్లో మరొకసారి ఓటమి తప్పదని, ప్రజల మద్దతుతో గులాబీ జెండాను మరోసారి ఎగరేస్తామని బీఆర్ఎస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో ప్రతిపక్షాలకు అందనంత దూరంలో బీఆర్ఎస్ ఉంటే, టిక్కెట్ ఎంపికలో తడబాటు పడుతున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీ శ్రేణుల్లో నిర్వేదం నెలకొంది.
ప్రచార పర్వాన్ని ముమ్మరం చేస్తూనే మరో పక్క కలిసివచ్చే నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ గులాబీ కండువా కప్పుతున్నారు. నియోజకవర్గంలో కీలక నేతలు మొదలు ద్వితీయ శ్రేణి నాయకుల వరకు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని, పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలుపించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. కాలనీలు, బస్తీల్లో అభ్యర్థులకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. గ్రేటర్లోని టీఆర్ఎస్ పార్టీకి లభిస్తున్న ప్రజాదరణను బట్టి మెజార్టీ నియోజకవర్గాలలో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.