ఏ పనైనా ఆలోచించి చేయాలంటారు.. తొందరపాటు.. అత్యాశ మనిషి జీవితాన్ని అథఃపాతాళంలోకి నెడుతుంది. సైబర్ వలలో చిక్కి.. మోసపోతున్న బాధితులకు ఈ సూత్రం సరిగ్గా సరిపోతుంది. స్వల్ప వ్యవధిలోనే అధిక లాభాలంటే.. అది ఎంతవరకు సాధ్యమో.. గ్రహించకుండానే…లక్షలు పోగొట్టుకుంటున్నారు. చదువు లేని వారంటే.. అవగాహన లేక అనుకోవచ్చు… కానీ.. మోసపోతున్న వారంతా ఎక్కువగా విద్యావంతులే ఉండటం బాధాకరం. ఆన్లైన్ అపరిచితులతో జర జాగ్రత్త అని ఎంత చెబుతున్నా… సులువుగా వారి వలలో పడిపోతున్నారు. ఇటీవల బిట్కాయిన్ ట్రేడింగ్తో గాలం వేసిన ఆగంతకులు.. మాయమాటలు చెప్పి.. మభ్యపెట్టి ముగ్గురు నుంచి ఏకంగా రూ.63 లక్షలు కొల్లగొట్టారు.
ఆగంతకులు వాట్సాప్, ఈ-మెయిల్స్, ఫోన్ ద్వారా సందేశాలు పంపిస్తున్నారు. స్పందించేవాళ్లతో వ్యాపారం పేరుతో పరిచయం చేసుకుంటున్నారు. ఫలాన వెబ్సైటు ద్వారా బిట్కాయిన్ బిజినెస్ చేస్తున్నామని, ట్రేడింగ్లో అధికంగా లాభాలు ఆర్జించవచ్చని, పెట్టిన పెట్టుబడికి వారం, పది రోజుల్లోనే రెట్టింపు వస్తుందని నమ్మిస్తున్నారు. ప్రస్తుతం బిట్కాయిన్ రూ. 31 లక్షల వరకు ఉంటుంది. కొనుగోలు చేసిన ప్రతి కాయిన్కు అడ్రస్ అనేది నంబర్, అల్ఫాబెట్ అక్షరాలతో కలిసి ఉంటుంది. ఒక బిట్కాయిన్లో కొంత భాగాన్ని కొంటూ.. ఆ విలువతో ట్రేడింగ్ చేస్తుంటారు. ఇలా కొనుగోలు చేసిన బిట్కాయిన్ను సైబర్నేరగాళ్ల చేతిలో పెట్టి..బాధితులు ట్రేడింగ్ చేస్తున్నారు.
సైబర్నేరగాళ్లు ముందుగా బిట్ కాయిన్ కొనిపిస్తున్నారు. సొంతంగా తయారు చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ యాప్లలో ఆ బిట్కాయిన్ను ఇన్వెస్ట్ చేయిస్తున్నారు. భారీ లాభం వస్తుందంటూ.. యాప్లోని స్క్రీన్పై సూచిస్తుంటారు. పెట్టుబడి ఎక్కువవుతుంటే సదరు వెబ్సైట్లోని స్క్రీన్పై భారీ లాభాలొస్తున్నాయంటూ నంబర్లు కన్పిస్తుంటాయి. అయితే వాటిని డ్రా చేసేందుకు వీలు లేకుండా ఉంటుంది. ఈ యాప్లో తప్పనిసరిగా బిట్కాయిన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా బాధితుల నుంచి నంబర్ను తమ సొంతం చేసుకుంటున్న సైబర్నేరగాళ్లు బిట్కాయిన్ను ఇతరులకు అమ్మేస్తున్నారు.
బిట్కాయిన్లో పెట్టుబడి పెట్టండంటూ..సందేశాలు రాగానే స్పందించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్.. కాయిన్పీ యాప్లో రూ. లక్ష పెట్టి.. మోసపోయాడు. వెంటనే ఓ మహిళ ఫోన్ చేసి.. గ్యారంటీ స్కీమ్లో చేరండి..భారీ లాభాలొస్తాయని, వచ్చిన దాంట్లో ఇద్దరం చెరిసగం తీసుకుందామని ఒప్పందం చేసుకుంది. బాధితుడు రూ. 4.5 లక్షలు డిపాజిట్ చేశాడు. మరుసటి రోజు రూ. 65 లక్షల లాభం స్క్రీన్పై కనిపించింది. వచ్చిన డబ్బులను నాలుగు భాగాలుగా విడగొడుదాం.. మొదటిగా రూ. 6.5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయగానే.. రూ. 13 లక్షలు రిలీజ్ చేస్తామని నేరగాళ్లు ఒప్పందం చేసుకున్నారు.
బాధితుడు రూ. 6.5 లక్షలు వేయగానే, మరో మూడు భాగాలవి కూడా డిపాజిట్ చేస్తేనే అన్ని ఇస్తామని షరతు విధించడంతో మోసాన్ని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం రూ. 12 లక్షలు పోగొట్టుకున్నాడు. వేర్వేరు కేసుల్లో కెకాయిన్ యాప్ పేరుతో ఓ నగర వాసికి సైబర్నేరగాళ్లు రూ. 8 లక్షలు మోసం చేశారు. డైమండ్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయంటూ.. సిటీ వ్యాపారికి వల వేసి, ఐడీఎక్స్.అప్ప్యాక్ట్.క్లబ్ పేరుతో ఉన్న లింక్ పంపించి.. రూ. 43 లక్షలు కాజేశారు.
పెట్టుబడి పేరుతో వచ్చే సందేశాలు, ఈ మెయిల్స్కు స్పందించవద్దు. బిట్కాయిన్ చిరునామా నంబర్తోనే ఉంటుంది. ఒకసారి ఆ నంబర్ను ఇతరులకు ఇచ్చామంటే.. ఎవరైనా అమ్ముకోవచ్చు. ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో చాలా మంది బిట్కాయిన్ కొని.. సైబర్ నేరస్తుల చేతిలో పెట్టడమే కాకుండా..పెట్టుబడి కింద మరింత డబ్బులు పెట్టి మోసపోతున్నారు.కేవీఎం ప్రసాద్,
ఏసీపీ, సైబర్క్రైమ్స్