Hyderabad | సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : బయో గ్యాస్ ( Bio Gas )ఉత్పత్తిలో జీహెచ్ఎంసీ ( GHMC ) అనూహ్య ఫలితాలను రాబడుతున్నది. జవహర్నగర్ డంపింగ్యార్డు ( Jawahar Nagar Dumping Yard ) చెత్త కుప్పల నుంచి రీ సైస్టెనబులిటీ సంస్థ రోజూ 5 టన్నుల సీఎన్జీ బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నది. ఇందులో రెండు టన్నుల గ్యాస్ను భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థకు విక్రయిస్తుండగా..సదరు సంస్థ పలు ఇండ్లకు సరఫరా చేస్తున్నది. ఇందులో భాగంగానే మూడు టన్నుల సీఎన్జీని దశల వారీగా వినియోగంలోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ నిర్వహణ సంస్థ రీ సైస్టెనబులిటీతో కలిసి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ను అమలు చేస్తున్నది. చెత్త తరలింపులో భాగంగా ప్రస్తుతం ఉన్న డీజిల్ వాహనాలకు స్వస్తి పలికి సీఎన్జీ ట్రక్కులను వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు.
తొలుత 100 సీఎన్జీ వాహనాలను తీసుకురావడం ద్వారా ఒకటిన్నర టన్ను గ్యాస్తో రోజూ వంద ట్రక్కులను నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి.. ఈ మేరకు 20 సీఎన్జీ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దశల వారీగా సీఎన్జీ వాహనాలను తీసుకువచ్చి మూడు నెలల్లోగా పూర్తి స్థాయిలో గ్యాస్ను వినియోగించేలా సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం బహుళ ప్రయోజనాలను అందిస్తున్నది. డంపింగ్యార్డులో చెత్తగుట్ట సమస్య తగ్గడంతో పాటు పర్యావరణ పరంగా, ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. గ్యాస్ ఉత్పత్తితో డీజిల్ వినియోగం తగ్గడం, వాయు కాలుష్యం తగ్గనుంది. వేస్ట్ ల్యాండ్ఫిల్ నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి దేశంలో ఇంతవరకు ఎక్కడా లేదని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.