హోటళ్లు, ఇండ్లలో వంట నూనెలను ఒకటి,రెండు సార్లు మాత్రమే వినియోగించాలి. పదే పదే మరిగించి వాడడం ప్రమాదకరం. అధిక ఉష్ణోగ్రత
వద్ద తరచూ వంట నూనెలను వినియోగించడంతోఆసిడ్ పెరిగి మానవ జీర్ణ ప్రక్రియపై ప్రభావం చూపుతుంది.
డీజిల్ ధరలు పెట్రోలు ధరలతో పోటీ పడుతున్నాయి. సెంచరీకి చేరువలో ఉన్న డీజిల్ ధరలతో వాహనదారులు కుదేలవుతున్నారు. పెట్రోలు వాహనం వాడే పరిస్థితిలేక.. డీజిల్ వినియోగం తగ్గే మార్గం కోసం వెతుకుతున్నారు.
ఈ రెండు సమస్యలకుఒకే ఒక పరిష్కారం..బయో డీజిల్. వాడినవంట నూనెల నుంచిబయో డీజిల్ను ఉత్పత్తిచేస్తున్నారు. ఇలా తయారైన బయోడీజిల్ను బ్లెండింగ్ పద్ధతిలో డీజిల్తో కలిపి వాహనాల్లో వినియోగిస్తున్నారు.
శ్రీనగర్కాలనీ, సెప్టెంబర్ 11 : బంజారాహిల్స్లోని ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాల ఈ దిశగా అడుగులు వేసింది. పరిశోధనలో భాగంగా 2019లో బయో డీజిల్ ప్రాజెక్టును చేపట్టగా కేంద్ర ప్రభుత్వం పేటెంట్ను మంజూరు చేసింది. మహానగరంలో ప్రసుత్తం వివిధ ప్రాంతాల్లో వినియోగించిన వంటనూనెను సేకరించి.. దానిని అధిక ఉష్ణోగ్రతల వద్ద వ్యర్థాల నుంచి బయో డీజిల్ను తయారు చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్ అండ్ డీ ప్రాజెక్టులో భాగంగా తక్కువ ఉష్ణోగ్రతలో బయోడీజిల్ ఉత్పత్తి ప్రక్రియను చేపట్టారు.
నివాసాలు, వివిధ హోటళ్లు, వ్యాపార కేంద్రాల నుంచి సేకరించిన వాడిన వంట నూనెలను తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేరు చేసేలా శుద్ధీకరణ చేస్తున్నారు. కళాశాల ప్రాంగణంలో రసాయన విభాగంలో ఆర్ అండ్ డీ ప్రాజెక్టులో భాగంగా బయో డీజిల్ ఉత్పతి ప్రక్రియను చేపట్టారు. ప్రాజెక్టు ఆవిష్కర్తలు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంజీవీ సత్యనారాయణ, డాక్టర్ ఇష్రత్మీర్జా మూడేండ్లుగా మెరుగైన ఫలితాలు సాధించే దిశగా పరిశోధనలు చేస్తున్నారు. వీరు సమర్పించిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పేటెంట్ను ఇచ్చింది. వీరు అనుసరిస్తున్న పద్ధతితో వినియోగంలో కార్భన్ డై ఆక్సైడ్ తగ్గుదల కనిపిస్తోందని వెల్లడించారు.
వాడిన వంట నూనెల నుంచి పూర్తి స్థాయిలో వ్యర్థాలను వినియోగించేలా శుద్ధి చేస్తున్నారు. ఈ వ్యర్థాల నుంచి 80 శాతం బయో డీజిల్ ఉత్పత్తి అవుతుండగా… మిగిలిన 20 శాతం వ్యర్థాలు సబ్బుల పరిశ్రమలో వినియోగించే పదార్థంగా వాడుకునే వీలుంది. ఈ ప్రాజెక్టు పర్యావరణ హితంగా.. వందశాతం వ్యర్థాలను పునర్వినియోగం చేసే అవకాశం కలుగుతోంది. ప్రాజెక్టులో అనుసరించే రసాయన ప్రక్రియ పర్యావరణ హితంగా ఉంటుందని ఆవిష్కర్తలు వెల్లడించారు. మెక్రోవేవ్లో వాడిన వంటనూనెను తక్కువ ఉష్ణోగ్రతతో ఉత్పత్తి ప్రక్రియ చేపట్టడంతో.. తక్కువ సమయంలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. ఇలా ఉత్పత్తి అయిన బయో డీజిల్ను ప్రసుత్తం అందుబాటులో ఉన్న వాహనాల సామర్థ్యానికి అనుగుణంగా డీజిల్తో కలిపి వినియోగించే వీలుంది. పూర్తిస్థాయిలో బయోడీజిల్తో నడిపేందుకు ప్రసుత్త వాహనాల యంత్రాల మార్పిడి అనివార్యం కావడంతో.. బ్లెండింగ్ పద్ధతితో 90 శాతం డీజిల్తో పదిశాతం బయో డీజిల్ను వినియోగించే వీలుంది.
ఇంజినీరింగ్ కళాశాల పరిశోధన, అభివృద్ధి విభాగంలో నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తున్నాం. ఇప్పటికే పలు ప్రయోగాత్మకంగా ప్రాజెక్టులకు నిధులు వెచ్చిచాం. ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా పరిశోధనలను ప్రోత్సాహిస్తున్నాం. బయో డీజిల్ ప్రాజెక్టు చక్కని ఫలితాలను అందిస్తుంది. మరింత పరిశోధనతో తక్కువ వ్యయంతో ఉత్పత్తిని సాధించేలా ప్రోత్సహిస్తాం.- జాఫర్ జావేద్, సొసైటీ కార్యదర్శి
వినియోగించిన వంట నూనెలతో పాటు బయో వ్యర్థాలను వాడకంతో తయారై బయోడీజిల్ వినియోగంతో వాహన కాలుష్యం తగ్గుతుంది. బయో డీజిల్ ఉత్పత్తితో ఫోర్స్ట్రోక్ వాహనాలకు వినియోగించగా.. సామర్థ్యంలో ఎలాంటి తేడా రాలేదు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వాహన కాలుష్యం తగ్గించేందుకు ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది. బయోడీజిల్తో పాటు పదిశాతం లోపే వచ్చే గ్లిజారల్ అయిల్ సబ్బుల పరిశ్రమలో వినియోగించుకొవచ్చు. మొత్తానికి సమాజానికి ఫ్రెండ్లీ ప్రాజెక్టు.
కళాశాల ప్రాంగణంలోని ఆర్ అండ్ డీ విభాగంలో నూతన పరిశోధనలకు ప్రాధాన్యమిస్తున్నాం. డ్రోన్ తయారీ, సోలార్ విద్యుత్తో చేనేతకు అవసరమైన దారం తీయడం, బయోడీజల్ ప్రాజెక్టులు ప్రధానంగా చేపట్టాం.- డాక్టర్ బషీర్ అహ్మద్, సొసైటీ డైరెక్టర్
బయో వ్యర్థాలు, వాడిన వంటనూనెలతో వాహనాలకు ఇంధనంగా వినియోగించేలా బయో డీజిల్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటికే మూడు దశల్లో ప్రాజెక్టు పరిశోధన చేపట్టాం. కేంద్ర ప్రభుత్వం పేటెంట్ను కూడా మంజూరు చేసింది. పెరిగిన చమురు ధరల మొత్తానికి ఈ ఉత్పత్తి సగం ధరకే అందే వీలుంది.- ఎంజీవీ సత్యనారాయణ, అస్టిసెంట్ ప్రొఫెసర్