మారేడ్పల్లి, అక్టోబర్ 7: తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నదని… జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 3 నుంచి మోండా డివిజన్ గ్యాస్మండిలోని క్రీడా మైదానంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజును పురస్కరించుకొని ‘తలసాని ట్రస్ట్’ ఆధ్వర్యంలో నిర్వహించిన తలసాని చాలెంజ్ కప్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్స్ ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి సినీ నటులు విశ్వక్ సేన్, నిఖిల్ సిద్దార్ధ్లతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా మంది క్రీడాకారులకు చేయూతను అందించామని తెలిపారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియంను ఏర్పాటు చేశామన్నారు. క్రీడా పోటీల్లో గెలిచిన వారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ నటులు విశ్వక్ సేన్, నిఖిల్ సిద్ధార్థ్ బహుమతులు అందజేశారు. పలువురికి మెమెంటోలను అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పాల్గొన్నారు.