Musheerabad | శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ సీటు హాట్ హాట్గా మారింది. అసెంబ్లీ సీటు విషయంలో ఇద్దరు బడా నేతల మధ్య అంతర్గత వార్ కొనసాగుతున్నది. ఒకరు వారసురాలికి టికెట్ ఇప్పించుకోవడానికి పావులు కదుపుతుండగా, మరో నేత పట్టును నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా మారిన ముషీరాబాద్ బీజేపీ టికెట్ ఇద్దరు అగ్రనేతల మధ్య అంతర్గత వైరానికి దారి తీస్తుంది. ఆ ఇద్దరు బడా నేతల్లో ఒకరు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాగా మరొకరు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ పార్లమెంటరి బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్. ఇద్దరూ ఉన్నత పదవుల్లో ఉన్నవారే కావడం, సొంత నియోజకవర్గం టికెట్ను ఇద్దరు నేతలు తమ పలుకుబడిని ఉపయోగించుకొని ఒకరు వారసురాలికి, మరొకరు ముఖ్య అనుచరునికి ఇప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయమై దత్తాత్రేయ, లక్ష్మణ్ల మధ్య దూరం పెరిగినట్లు సమాచారం. ఇదే విషయమై నియోజకవర్గం పార్టీ శ్రేణుల్లో ప్రచారం సాగడంతో ఇటీవల దత్తాత్రేయతో సమావేశమైన లక్ష్మణ్ తన అసంతృప్తిని వెళ్లగక్కినట్లు తెలిసింది. అనుకోని పరిస్థితుల్లో వారిద్దరినీ అధిష్ఠానం కాదంటే తమకు అవకాశం వస్తుందేమోనని ఆ పార్టీకి చెందిన 36 మంది నాయకులు ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
వారసురాలి కోసం దత్తన్న ఆరాటం..
బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ సారి ఎన్నికల్లో తన వారసురాలిని బరిలో నిలపడానికి పావులు కదుపుతున్నారు. తాను నివాసం ఉంటున్న ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి తన కూతురు విజయలక్ష్మిని బరిలో నిలపాలని భావిస్తున్నారు. ఇప్పటికే అంతర్గత కార్యకలాపాలు మొదలు పెట్టిన దత్తాత్రేయ, ఆయన కూతురు విజయలక్ష్మి పార్టీ సీనియర్ నాయకులతో డివిజన్ల వారిగా సమావేశమై చర్చించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో టికెట్ తనకే వస్తుందని, తన గెలుపుకోసం సహకరించాలని దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి పార్టీ నేతలను కోరుతున్నట్లు తెలుస్తొంది. ఇటీవల పలు పార్టీ, ఇతర కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న ఆమె తండ్రిని నమ్ముకొని టికెట్పై గంపెడాశలు పెట్టుకున్నారు. దత్తాత్రేయ సైతం వయో భారం, గవర్నర్ పదవీ కాలం మరో యేడాదిలో ముగియనుండటంతో తన వారసురాలికి టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం.
పట్టు కోసం లక్ష్మణ్ పోరాటం..
ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైన డాక్టర్ లక్ష్మణ్ తనకు ఉన్న పట్టును కొనసాగించడానికి తన ముఖ్యఅనుచరునికే టికెట్ ఇప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బీజేపీ అధిష్ఠానం లక్ష్మణ్ను అసెంబ్లీ బరిలో నిలవాలని సూచిస్తున్నా పోటీకి ఆసక్తి చూపడం లేదని తెలుస్తొంది. ప్రస్తుతం యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా కొనసాగుతున్న లక్ష్మణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఇష్టపడటం లేదు. రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేని లక్ష్మణ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే రెంటికీ చెడ్డ రేవడిగా మారుతుందనే భయం వెంటాడుతున్నట్లు ప్రచారం సాగుతుంది. అదే సమయంలో ముషీరాబాద్ సీటు కోసం తన ముఖ్య అనుచరున్ని తెరపైకి తీసుకువస్తున్నారు.