సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి దివ్య క్షేత్రం సందర్శనకు వస్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఆ మార్గంలో ఉన్న బీబీనగర్, భువనగిరి (పెద్ద చెరువు) చెరువులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్కు అప్పగించింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ.రామారావు ఆదేశాల మేరకు ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ పర్యవేక్షణలో ఇంజినీరింగ్, అర్బన్ ఫారెస్ట్ అధికారులు సుమారు రూ.17 కోట్ల వ్యయంతో బీబీనగర్, భువనగిరి చెరువుల సుందరీకరణ పనులను హెచ్ఎండీఏ నిర్వహించనున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఘట్కేసర్ నుంచి ఆలేరు వరకు హెచ్ఎండీఏ పచ్చదనాన్ని అభివృద్ధి చేసింది. బీబీనగర్-భువనగిరి చెరువులకు కొత్త అందాలు తీసుకువచ్చేందకు ప్రాజెక్టుకు సోమవారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. రెండు చెరువులను ట్యాంక్బండ్గా మార్చడంతో పాటు వాటినై పచ్చని అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకువచ్చే విధంగా రకరకాల పూల మొక్కలు, పిల్లల కోసం బొమ్మలు, పాదాచారుల కోసం నడకదారులు, యువతీ యువకుల కోసం జిమ్ పరికరాలు, సందర్శకులు సేదతీరేందుకు బెంచీలు, చెరువు అందాలను వీక్షించేందుకు వ్యూ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న స్మశాన వాటికలు, దోబీఘాట్ వద్ద వాటికి అవసరమైన ప్రహరీగోడల నిర్మాణాలు సైతం హెచ్ఎండీఏ నిధులతోనే పూర్తి చేస్తామని తెలిపారు.