సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): బోయిగూడ అగ్నిప్రమాద ఘటనకు షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసు, అగ్నిమాపక శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చాయి. అయితే రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. శ్రావణ్ ట్రేడర్స్ స్క్రాప్ గోడౌన్లో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం నుంచి బయట పడ్డ ప్రేమ్ ప్రస్తుతం గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదానికి కారణాలపై లోతైన దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. మంటలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ క్లూస్ టీమ్ విభాగాధిపతి వెంకన్న నేతృత్వంలోని బృందాలు గురు, శుక్రవారాల్లో ఘటనా స్థలిలో సేకరించిన నమూనాలను విశ్లేషిస్తున్నారు.
బోయిగూడలోని అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని శుక్రవారం మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, అగ్ని మాపక శాఖ డీజీ మాదిరెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి, ఎమ్మార్వో బాలశంకర్, అగ్ని మాపక అధికారి శ్రీనివాస్లతో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దుర్ఘటనలో 11 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమంటూ.. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతున్నదని, త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు.
బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ.. బిహారీ వలస కూలీలు శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిశారు. తెలంగాణ సర్కారు వెంటనే స్పందించడం, రూ. 5 లక్షల నష్ట పరిహారం ప్రకటించడం, మృతదేహాలను తరలించేందుకు సహకరించడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు. తాము పొట్టకూటి కోసం నగరానికి వచ్చామని, కొందరు కాంట్రాక్టర్లు సకాలంలో కూలీ డబ్బులు ఇవ్వడం లేదని వాపోయారు. వారి వినతికి తక్షణమే స్పందించిన మంత్రి జిల్లా కలెక్టర్ శర్మన్తో ఫోన్లో మాట్లాడి.. సదరు కాంట్రాక్టర్లు వలస కార్మికులకు సత్వరమే కూలీ డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రిని కలిసిన వారిలో భీమ్ ఆర్మీ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ అయాజ్, బన్సీలాల్పేట్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు తదితరులు ఉన్నారు.