Bharosa & She Teams | చిన్నారులు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే దుర్మార్గులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఎంతటి ఘాతుకాలు చేసినా పరువు కోసం బాధితులు తమను ఏమీ చెయ్యలేరని ధీమాతో ఉన్న నేరస్తుల గుండెలు జారిపోతున్నాయి. బాధితుల తరఫున షీ టీమ్స్, భరోసా కేంద్రాలు పట్టువదలక పోరాడుతుండటంతో తప్పుచేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నెలల వ్యవధిలోనే కేసుల దర్యాప్తు పూర్తిచేసి దోషులకు శిక్షలు పడేలా చేస్తూ భరోసా కేంద్రాలు బాధితుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. బాధితులను అక్కున చేర్చుకొని ఓదార్చుతూ వారి తరఫున పోరాడున్నాయి. షీ టీమ్స్, భరోసా అధికారిగా ఉన్న అదనపు సీపీ శిరీష రాఘవేంద్ర ఆధ్వర్యంలోని బృందాలు ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి.. నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 217 పొక్సో కేసులు భరోసా కేంద్రానికి రాగా, 37 కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి. 18 కేసుల్లో దోషులకు కఠిన శిక్షలు పడ్డాయి. బాధితులకు నష్టపరిహారం ఇప్పించడంలోనూ ‘భరోసా’ కీలకంగా వ్యవహరిస్తున్నది.
➤ నాలుగేండ్ల బాలికపై సొంత చిన్నాన్నే అఘాయిత్యం చేసిన కేసు భరోసా కేంద్రానికి వచ్చింది. తీవ్రగాయాలతో ఉన్న ఆ పాపను బంధువులు జనవరిలో నిలోఫర్ దవాఖానకు తీసుకొచ్చారు. కిందపడటంతో గాయాలయ్యాయని కుటుంబసభ్యులు చెప్పటంతో అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైఫాబాద్లో కేసు నమోదు కాగానే దర్యాపును భరోసా కేంద్రానికి అప్పగించారు. దర్యాప్తులో భాగంగా చిన్నారి నుంచి వాస్తవాలు తెలుసుకొనేందుకు భరోసా టీం చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరకు బాలికను ఆడిస్తూ, పాడిస్తూ విషయం మొత్తం తెలుసుకొన్నారు. చిన్నారి స్టేట్మెంట్, వైద్యుల రిపోర్టులు, ఫోరెన్సిక్ నివేదికలు, సాక్ష్యాలను పక్కాగా సేకరించి కోర్టులో చార్జిషీట్ వేశారు. దీంతో కోర్టు నిందితుడికి 25 ఏండ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
➤ తుకారంగేట్లో నివాసముండే దివ్యాంగురాలైన బాలికపై సీసీఎస్లో డ్రైవర్గా పనిచేస్తున్న మల్లికార్జున అనే హోంగార్డు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అమ్మాయి గర్భం దాల్చింది. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ నిందితుడు బెదిరించాడు. ఈ విషయం బయటకు రావడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి వద్ద అన్ని వివరాలు తీసుకున్న భరోసా కేంద్రం ఆమెకు అండగా నిలిచింది. అన్ని ఆధారాలు సమర్పించడంతో కోర్టు నిందితుడికి 30 ఏండ్ల జైలు శిక్ష, రూ.40 వేల జరిమానా విధించింది.
➤ కన్న బిడ్డలపైనే ఓ దుర్మార్గుడు అఘాయిత్యం చేశాడు. ముగ్గురు ఆడపిల్లల తండ్రి అయిన అతడు, ఇద్దరు పెద్ద బిడ్డలను బలవంతంగా లోబర్చుకొన్నాడు. అదే విధంగా మూడో బిడ్డపై అఘాయిత్యం చేయబోతే ఆమె షీ టీమ్స్కు ఫిర్యాదు చేసింది. అదనపు డీసీపీ శిరీష బృందం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని బాధితురాలికి పూర్తి భరోసా కల్పించింది. బాధితురాలి సోదరిమణులతో మాట్లాడి అభయం ఇవ్వడంతో తండ్రి దారుణాలపై వారు పెదవి విప్పారు. కేసును పక్కాగా దర్యాప్తు చేసిన భరోసా బృందం నిందితుడికి యవజ్జీవ కారాగార శిక్ష పడేలా చేసింది.
ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారులకు ‘భరోసా’ ఎల్లప్పుడు అండగా ఉంటుంది. బాధిత మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి, వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు ప్రత్యేక కౌన్సిలింగ్ వ్యవస్థ ఉన్నది. పిల్లల భవిష్యత్పై ఆందోళన చెందకుండా ధైర్యంగా సమస్యను ఎదుర్కొవాలి. పిల్లలు, పెద్దలపై జరిగే అఘాయిత్యాలను దాచిపెట్టవద్దు. నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి. భరోసా మీ కోసం ఉన్నదనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ కేంద్రం నుంచే వైద్య, న్యాయసేవలు అందుతాయి.- శిఖా గోయెల్, అదనపు కమిషనర్ (షీ టీమ్స్/ భరోసా ఇన్చార్జి)