వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలన్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. గురువారం సైతం పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. కందుకూరు మండల కేంద్రంలో జరిగిన మహా ధర్నాలో మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ రైతు వ్యతిరేకిగా మారిందని మంత్రి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చి.. రైతుల కష్టాలు పోగొడుతుంటే.. రేవంత్కు కండ్లు మండుతున్నాయని, అందుకే వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలంటున్నారని మండిపడ్డారు. అలాగే ఆల్విన్చౌరస్తాలో రేవంత్, కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతుల పొట్ట కొట్టేలా మాట్లాడిన రేవంత్రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ డిమాండ్ చేశారు. దుండిగల్లో ఎమ్మెల్యే వివేకానంద్, ఉప్పల్ సైనిక్పురిలో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి నిరసన తెలిపారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై రైతులు కన్నెర్ర జేశారు. ‘వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదు. 3 గంటల కరెంటు ఇస్తే చాలు” అంటూ విషం కక్కడంపై భగ్గుమన్నారు. ఇలాంటి ఓర్వలేని మాటలు మాట్లాడితే వాతలు పెడుతామంటూ హెచ్చరించారు. గురువారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మహేశ్వరంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, శేరిలింగంపల్లిలో ప్రభుత్వ విఫ్ ఎమ్మెల్యే, అరెకపూడి గాంధీ, కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నిరసనలు తెలిపారు. రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలకు శవయాత్ర చేసి, దహనం చేశారు. రేవంత్రెడ్డిని పీసీసీ పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినదించారు. రైతుల పొలాలు పచ్చగా ఉంటే రేవంత్ కండ్లు మండుతున్నాయని, అందుకే నీచమైన వ్యాఖ్యలు చేస్తూ.. మళ్లీ తెలంగాణను చీకట్లోకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ కాంగ్రెసోళ్లు అధికారంలోకొస్తే పొలాల్లో పల్లేర్లే మొలిపిస్తారని అన్నారు. రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పకుంటే కర్షకులు కర్రు కాల్చి వాతలు పెడుతారని హెచ్చరించారు.