హైదరాబాద్ : గ్యాస్ స్టౌవ్ రిపేర్ పేరిట ఎవరైనా మీ ఇంటికి వస్తున్నారా? అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారిని నమ్మి మోసపోవద్దు అని గ్యాస్ ఏజెన్సీలు సూచిస్తున్నాయి. సరూర్నగర్లో నివాసముంటున్న నిర్మల అనే గృహిణి ఇంటికి ఆదివారం గ్యాస్ స్టౌవ్ రిపేర్ పేరిట ఓ వ్యక్తి వచ్చాడు. ఏదో రిపేర్ చేసినట్టు నటించి రూ. 6 వేలు తీసుకుని వెళ్లిపోయాడు. మరో ఇంటికి వెళ్లిన ఆ వ్యక్తి.. గ్యాస్ స్టౌవ్ను చెక్ చేసి.. గ్యాస్ లీక్ అవుతోందని చెప్పాడు. అక్కడ రిపేర్ పేరిట రూ. 3 వేలు లాగేశాడు. అతను వెళ్లిన కాసేపటికే ఆ ఇంటి యజమాని సదరు గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేసి తెలుపగా, తాము ఎలాంటి టెక్నిషీయన్ను పంపలేదని పేర్కొన్నారు. అలా రెండు, మూడు ఇండ్లు తిరిగి మోసం చేసేందుకు యత్నించాడు. అతను నకిలీ టెక్నిషీయన్ అని నిర్ధారించుకున్న ఓ మహిళ.. గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేసి టెక్నిషీయన్ను పిలిపించగా, గ్యాస్ స్టౌవ్కు ఎలాంటి ప్రమాదం లేదని తేలింది.
ఈ సందర్భంగా హెచ్పీ గ్యాస్ కంపెనీ యాజమాన్యం స్పందించింది. తమ ఏజెన్సీ పేరు చెప్పుకుని నకిలీ టెక్నిషీయన్లు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్టు తమకు సమాచారం ఉంది. గ్యాస్ ఏజెన్సీలు ఒక వేళ రిపేర్ చేస్తే చాలా తక్కువగా ఛార్జీలు వసూలు చేస్తారని తెలిపింది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ వచ్చినా కూడా.. టెక్నిషీయన్ ఐడీ కార్డును పరిశీలించి అనుమతించాలని సూచించింది. తమ టెక్నిషీయన్లు ఎల్లప్పుడూ యూనిఫాం ధరించి వస్తారని తెలిపింది.