పీర్జాదిగూడ, జూలై 24 : ఉప్పల్-నారపల్లి మధ్య కేంద్రప్రభుత్వం చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులు ఏండ్లుగా నత్తనడకన కొనసాగుతుండడంతో ఆ రహదారి దుర్భరంగా మారి యాదాద్రి, వరంగల్ వెళ్లే ప్రయాణికులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితిని వివరిస్తూ మంత్రి మల్లారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి సోమవారం ముఖ్య మంత్రి కేసీఆర్కు వినతి పత్రం అందించారు. ఇందుకు స్పందించిన సీఎం.. ఎలివేటెడ్ కారిడార్ పనులతో సంబంధం లేకుండా పిల్లర్లకు రెండువైపులా నాణ్యమైన రోడ్డు వేయాలని ఆర్అండ్బీ మంత్రి ప్రశాంత్రెడ్డిని అప్పటికప్పుడు ఆదేశించారు.
ప్రజలు, వాహనదారుల అవస్థలను తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఔదార్యం చాటుకున్నది. ఐదు సంవత్సరాల కిందట శంకుస్థాపన చేసిన ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనుల జాప్యంపై, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సీఎం కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వరంగల్ జాతీయ రహదారిపై చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఈ రోడ్డును ఆధునీకరించాల్సి ఉంటుంది. కానీ ఎలివేటెడ్ కారిడార్ పనులు మరో రెండు, మూడేండ్లు అయినా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈక్రమంలోనే మంత్రి మల్లారెడ్డి, మేయర్ వెంకట్ రెడ్డి సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ను కలిసి ఉప్పల్, నారపల్లి రోడ్డు పరిస్థితిని వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ ఉప్పల్ నుంచి నారపల్లి సీపీఆర్ఐ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులతో నిమిత్తం లేకుండా, ప్రజలు, వాహనదారుల సౌకర్యార్థం కారిడార్కు రెండు వైపుల నాణ్యమైన బీటీ రోడ్డు వేయాలని ఆర్అండ్బీ మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు.
ఉప్పల్, నారపల్లి మీదుగా యాదాద్రి, వరంగల్ వరకు లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్న రోడ్డును వెంటనే ఆధునీకరించాలని, ఎన్ని నిధులు ఖర్చుఅయినా సరే సాధ్యమైనంత త్వరగా బీటీ రోడ్డు వేయాలని సీఎం కేసీఆర్ మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు ఆర్అండ్బీ ఉన్నతాధికారులకు సూచించారు. లక్షల మంది ప్రజలు, వాహనదారుల ఇబ్బందులను గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఎన్నో ఇబ్బందులున్నా.. భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించామని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, ఐదు సంవత్సరాల కిందట మొదలు పెట్టిన పనులు నేటి వరకు 50 శాతం కూడా పూర్తి చేయకపోవడం శోచనీయమని అన్నారు. ఉప్పల్, పీర్జాదిగూడ మీదుగా రాకపోకలు సాగించే వాహనదారుల ఇబ్బందులను తీర్చేందుకు కేంద్రం చేయాల్సిన పనులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.