మలక్పేట, ఫిబ్రవరి 13 : ట్రాఫిక్ నియమాలను ఉల్లఘించటం ప్రమాదకరం, చట్టరీత్యా నేరమని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్(టీటీఐ) ఏసీపీ జి.శంకర్రాజు పిల్లలకు సూచించారు. జువైనల్ జస్టిస్ బోర్డు మేజిస్ట్రేట్ రాధిక గవ్వల అభ్యర్థన మేరకు సోమవారం సైదాబాద్లోని జువైనల్ హోంలో రోడ్డు భద్రత, మోటార్ వెహికిల్ యాక్ట్ 1988, 2019లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శంకర్రాజు మాట్లాడుతూ.. ప్రమాదకరంగా వాహనాలు నడిపి విలువైన జీవితాలను కోల్పోవద్దని సూచించారు.
దేశంలో ప్రతియేటా లక్షలాదిమంది రోడ్డు ప్రమాదాల బారినపడి మృతిచెందుతున్నారన్నారు. అతివేగంగా, ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసే ముందు కుటుంబ సభ్యులను రి గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. వేగంకన్నా, ప్రాణం మిన్నా అని, ఎంత తొందరగా చేరుకున్నామన్నది ముఖ్యంకాదని, ఎంత సురక్షితంగా చేరుకున్నామన్నదే ముఖ్యమని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు వాహనచోదకుల సురక్షిత ప్రయాణాలకోసమేనన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తెరగాలన్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించటమేనని పేర్కొన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడుపరాదు..
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్న వారిలో ఎక్కువ శాతం 18 నుంచి 40 ఏండ్ల లోపువారే ఉంటున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నవారిలో అధిక సంఖ్యాకులు మైనర్లు, యువతేనని వివరించారు. ప్రమాదాలులేని సురక్షిత ప్రయాణాలకోసమే ట్రాఫిక్ నియమాలని తెలిపారు. మైనర్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయటం, సెల్ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడుపటం ప్రమాదకరమని, రవాణా చట్టం ప్రకారం నేరమని పేర్కొన్నారు. అవగాహన లేనివారే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలబారిన పడుతున్నట్లు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల సీసీ ఫుటేజీల ఆధారంగా తెలుస్తుందన్నారు.
మైనర్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్ ఎక్కువైనాయని, సెల్ఫోన్లలో సంభాషిస్తూ అనేకమంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ఈ సందర్భంగా ర్యాష్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను చూపించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జువైనల్ జస్టిస్ బోర్డు మేజిస్ట్రేట్ రాధిక గవ్వల, బాలూర అబ్జర్వేషన్ హోం సూపరింటెండెంట్ సయ్యద్ అఫ్జల్ షాహాలీ, స్టేట్ ఆఫ్టర్ కేర్ హోం ఫర్ మెన్ సూపరింటెండెంట్ ఎ.నవీన్కుమార్, రీజినల్ ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ కె.రవికుమార్, జె.జె.బి. సభ్యుడు జి.వాసు, బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ సిబ్బంది అబ్దుల్ మాజిద్ఖాన్, చిరంజీవి పాల్గొన్నారు.