సిటీబ్యూరో, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): వైద్య రంగంలో వస్తున్న కొత్త ఒరవడులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర కీలకమని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఎయిమ్స్లో నిర్వహించిన హెల్త్ జర్నలిస్టులు, ప్రభావితుల జాతీయ సదస్సులో దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు వైద్య నిపుణులు, హెల్త్ జర్నలిస్టులు, మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ, వైద్య రంగానికి సంబంధించిన అంశాలను ప్రభావితం చేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వల్ల ప్రజలు అనుకూల, ప్రతికూలంగా కూడా ప్రభావితమవుతున్నట్లు తెలిపారు. వైద్య రంగంలో వచ్చే ఆధునిక వైద్య పద్ధతులు, రోగ నిర్ధారణ పద్ధతులు, ఔషధాలు, వాటి ఫలితాలు వంటి అంశాలను మీడియా ఖచ్చితమైన సమాచారంతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దీని వల్ల రోగులకు సరైన చికిత్స లభిస్తుందని అభిప్రాయపడ్డారు. కొన్ని రకాల సోషల్ మీడియా, మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లడంతో ప్రాణనష్టం జరిగే ప్రమాదం లేకపోలేదని, అలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నట్లు వక్తలు వాపోయారు. ఏదైనా మీడియా లేదా సోషల్ మీడియా ద్వారా ఇలాంటి తప్పుడు సమాచారం వచ్చిన వెంటనే వైద్యనిపుణులు స్పందించి, ప్రజలకు సరైన సూచనలు చేయాలన్నారు. వైద్యరంగంలో వచ్చిన కొత్త అంశాలను మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత అటు వైద్య నిపుణులు, ఇటు మీడియా ప్రతినిధులపై కూడా ఉందన్నారు.
ముఖ్యంగా ఏదైనా ఒక వ్యాధి గురించి లేదా చికిత్సా పద్థతులు, వ్యాధి నిర్ధారణ పద్ధతులు లేదా కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఔషధాల గురించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడు నిష్ణాతులైన వైద్యనిపుణుల అభిప్రాయాలతో కూడిన స్పష్టమైన, ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి ప్రజలకు చేరవేయాలన్నారు. మీడియా, హెల్త్ రైటర్స్, సోషల్ మీడియా ఇచ్చే ఇలాంటి సమాచారం ప్రజలను ఎంతగానో ప్రభావితం చేస్తుందని పలువురు వైద్యనిపుణులు తెలిపారు. అనంతరం టీబీ, డయాబెటిక్, ఒబేసిటి, క్యాన్సర్, కిడ్నీ, హార్టర్టాక్ తదితర దీర్ఘకాలిక వ్యాధులు, వైద్యరంగంలో వస్తున్న డిజిటల్ పద్ధతులు తదితర అంశాలపై వైద్యనిపుణులు, వైద్య సాంకేతిక నిపుణులు చర్చించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీబీ అండ్ రెస్పిరేటరీ డిసీజస్ (ఎన్ఐటీఆర్డి), టీబీ అండ్ చెస్ట్ డిసీజస్ విభాగం ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడీ డాక్టర్ రూపక్ సింగాల్,ఎన్టీఈపీ సెంట్రల్ టీబీ డివిజన్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంజయ్ కె మట్టూ, న్యూ ఢిల్లీ ఎయిమ్స్ పల్మనరి, క్రిటికల్ కేర్ అండ్ స్లీప్ మెడిసిన్ విభాగం అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ హడ్డ, ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ రిజిస్టార్ డాక్టర్ గిరీష్ త్యాగి, అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కేతర్ పాల్, జపాన్ హొరిబా కార్పొరేట్ ఆఫీసర్ డాక్టర్ రాజీవ్ గౌతమ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్ తదితర రాష్ర్టాలకు చెందిన హెల్త్ రిపోర్టర్లు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.