సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): విద్యుత్ ప్రమాదాలతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు సూచించిన నాణ్యమైన పరికరాలను వినియోగించాలని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బేగంపేటలోని హోటల్ ది ప్లాజాలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నిర్వహించిన కేఈఐ టెక్నికల్ సెమినార్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ కోతలకు చోటు లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించేలా సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రణాళికలు రూపొందించి పక్కాగా అమలు చేస్తున్నారన్నారు. పట్టణాల్లోనే కాదు మారుమూల గ్రామాల్లో సైతం విద్యుత్ కోతలు లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. విద్యుత్ శాఖ అధికారులు చేసే సూచనలు క్షేత్రస్థాయిలో అందరూ పాటిస్తే, విద్యుత్ ప్రమాదాలకు అవకాశం ఉండదన్నారు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో విద్యుత్ వైర్లు, ఇతర పరికరాలు ఎంతో నాణ్యత కలిగినవై ఉండాలని, ఇండియన్ బ్యూరో ఆఫ్ స్టాండర్స్ ప్రకారమే తయారైన వాటినే ఎలక్ట్రికల్ నిపుణులు వినియోగించాలన్నారు. ఇండ్లు, పరిశ్రమలు, మరెక్కడైనా విద్యుత్ను వినియోగిస్తున్నప్పుడు నిపుణులతో విద్యుత్ సరఫరా ఎలా ఉన్నది? పూర్తిగా ఆగిపోతుందా? లేదా వంటి విషయాలను తరచూ తనిఖీ చేసుకోవాలని సూచించారు. టీఎస్ఎస్పీడీసీఎల్ సీజీఎం సీహెచ్.చక్రపాణి మాట్లాడుతూ.. భవనాలకు విద్యుత్ భద్రత తప్పనిసరిగా ఉండాలని, ఐఎస్ఐ మార్కు ఉన్న విద్యుత్ పరికరాలను వాడాలని సూచించారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.భాస్కర్, తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు మాజీ సభ్యుడు నక్క యాదగిరి, అసోసియేషన్ ప్రతినిధులు మైపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ప్రవీణ్రాజు, రంజిత్ రెడ్డి, నారాయణ పాల్గొన్నారు.