కాచిగూడ, ఆగస్టు 10: బీసీలంటే బిచ్చగాళ్లు కాదని, రాజ్యాధికారంలో హక్కుదారులని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలంతా తిరగబడితేనే దేశ సమస్యలతోపాటు బీసీల సమస్యలు కూడా పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. మోదీ పాలనలో దేశం తిరోగమన దిశలో పయనిస్తున్నదని విమర్శించారు. ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో బీసీలు పార్లమెంటును ముట్టడించారు.
బీసీ కుల గణనను కేంద్రం వ్యతిరేకిస్తున్నదని, దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు ప్రధాని వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీచేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేన్లు కల్పించేలా బిల్లును వెంటనే పార్లమెంటులో పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ రాష్ర్టాల నుంచి వేల మంది బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నేతలు లాల్కృష్ణ, కోలా జనార్దన్, వేణుమాదవ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.