ముషీరాబాద్, జనవరి 27: కులగణన ముందుకు సాగకపోవడానికి బీజేపీలోని కొన్ని కలుపు మొక్కలు, స్వార్థపరులే కారణమని, వారి వల్లనే జేపీకి నష్టం జరుగుతుందనే విషయాన్ని ఆ పార్టీ గమనించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. ముఖం చూపించుకొని ఓట్లు వేయించుకునే వారికి ఇది అలవాటుగా మారిందని మండిపడ్డారు.
విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ ముఖ్య నేతల సమావేశం, ఏపీ బీసీ కమిషన్ సభ్యునిగా ఎంపికైన డాక్టర్ మారేశ్కు శనివారం సత్కార సభ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం బీసీలను చిన్న చూపు చూస్తున్నదని, బీసీ నేత ప్రధానిగా ఉన్నప్పుడే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలు, కుల గణన సాధ్యమవుతుందని ఎదురు చూస్తున్న బీసీలకు నిరాశే ఎదురవుతున్నదన్నారు.
బడా వ్యాపారవేత్తకు 14 లక్షల కోట్ల రుణ బకాయిలు మాఫీ చేసిన కేంద్రం బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ఇవ్వడానికి చేతులు రావడం లేదని మండిపడ్డారు. కులగణన చేస్తే బీసీలకు న్యాయమైన వాటా ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే కేంద్ర ప్రభుత్వం కుల గణన చేయడానికి ముందుకు రావడం లేదని ఆక్షేపించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు, కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 5, 6 తేదీలతో పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శనలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ మారేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, రాజ్ కుమార్, రాజేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.