కంటోన్మెంట్, జూలై 16: కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ అన్నారు. ఈ మేరకు కంటోన్మెంట్ రెండో వార్డులోని రసూల్పురా శ్రీలంక బస్తీలో శనివారం రాత్రి పలు సమస్యలపై రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ 17వ ‘బస్తీ నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 400 మంది స్థానికులతో స్థానికంగా నెలకొన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా బస్తీలో బోర్డు నిర్లక్ష్యం కారణంగా డ్రైనేజీ సమస్య, రహదారులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని క్రిషాంక్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం, క్రిషాంక్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం కల్పించే ఓటు హక్కును సైతం కేంద్రం తుంగలో తొక్కుతుండటం గర్హనీయమన్నారు.
తొలగించిన సుమారు 35 వేల ఓట్లను పునరుద్ధరించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖలు రాశారని గుర్తు చేశారు. కంటోన్మెంట్లోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే స్కైవేల నిర్మాణం చేపడుతామని, ప్రజా రవాణాకు సులభతరం అవుతుందని పలుమార్లు మొర పెట్టుకున్నా కేంద్రం కనికరించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకు బీఆర్ఎస్ సర్కారు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కంటోన్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి సహకారం అందిస్తున్నారని తెలిపారు. దీంతో పాటు కంటోన్మెంట్ ప్రాంతానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని డిజిటల్ రూపంలో స్థానికులకు తెలియజేశారు. అనంతరం, స్థానికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో నజీర్, తాజ్, నయీం, ఫహీం, యూనస్, సమీర్, మిన్హాజ్, అస్లాం, మోని, రఘు, సాయి పాల్గొన్నారు.