సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ) : పేద ప్రజల కోసం సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీల్లో బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మాసాబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శర్మన్తో కలిసి హౌసింగ్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను హైదరాబాద్ జిల్లా పరిధిలోని 22 ప్రాంతాల్లో నిర్మించి అర్హులైన పేదలకు ఉచితంగా అందజేసినట్లు చెప్పారు. వారికి ఉచితంగా వైద్య సేవలు అందించడం కోసం ఆయా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీల్లో బస్తీ దవాఖానలను వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సహకారంతో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శర్మన్ను మంత్రి ఆదేశించారు. అదే విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీల్లో నివసిస్తున్న పిల్లల సంరక్షణ కోసం స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారుల సహకారంతో అంగన్ వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్తీ దవాఖాన, అంగన్ వాడీ కేంద్రాల ఏర్పాటుకు ఆయా కాలనీల్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని తెలిపారు.
షాపుల కేటాయింపునకు అర్హులను గుర్తించండి
సనత్నగర్ నియోజకవర్గం పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించగా మిగిలిన ఇండ్ల కేటాయింపు, షాపుల కేటాయింపుపై అధికారులతో మంత్రి శ్రీనివాస్ యాదవ్ సమీక్షించారు. అర్హత ఉన్నా.. ఇండ్లు రాలేదని అనేక మంది తన వద్దకు వస్తున్నారని, వారిలో అర్హులైన వారు ఉంటే గుర్తించి ఇండ్లను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఏర్పాటు చేసిన లిఫ్ట్లు, కాలనీ నిర్వహణ అవసరాల కోసం ఉపయోగపడతాయనే ఉద్దేశంతో షాప్లను నిర్మించడం జరిగిందని తెలిపారు. నేటి వరకు షాప్లను కేటాయించకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయని, వెంటనే వాటిని అర్హులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
త్వరలోనే హమాలీ బస్తీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
సీఎం కేసీఆర్ హమాలీ బస్తీ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆ ప్రాంత ప్రజల జీవనస్థితిని చూసి చలించిపోయి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తామని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గుర్తుచేశారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయని, స్థానిక ప్రజల అభ్యంతరాల మేరకు నేటి వరకు పనులు చేపట్టలేకపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారని, త్వరలోనే బస్తీ వాసులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత, హౌసింగ్ సీఈ సురేశ్, ఈఈ వెంకటదాసు రెడ్డి, సికింద్రాబాద్, ముషీరాబాద్, ఖైరతాబాద్ తాసీల్దార్లు బాల శంకర్, అయ్యప్ప, మహ్మద్ అన్వర్, భూ సేకరణ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ముకుంద రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
15న బండమైసమ్మనగర్ బస్తీలో..310 డబుల్ ఇండ్లు ప్రారంభం
బన్సీలాల్పేట్, మే 5 : సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని బండమైసమ్మనగర్ బస్తీలో రూ.27.20 కోట్ల వ్యయంతో నిర్మించిన 310 డబుల్ బెడ్రూం ఇండ్లను ఈ నెల 15న ప్రారంభించి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని హౌసింగ్, రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు.