Breast Cancer | సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : దేశంలోని 40 ఏండ్లలోపు మహిళలు 25శాతం రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నట్లు అపోలో హెల్త్ స్క్రీనింగ్ డేటా ఆధారంగా వెల్లడించింది. గ్లోబల్ మార్గదర్శకాల ప్రకారం 2018 నుంచి 2023వరకు ఐదేండ్ల పాటు పరిశోధించిన వివరాలు వెల్లడించింది. గత ఐదేండ్లలో సుమారు లక్షా 50వేల మంది 40ఏండ్లలోపు మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించగా 25శాతం మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్లు రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసాన్ని పురస్కరించుకొని అపోలో హాస్పిటల్ వెల్లడించింది.
అపోలో ప్రివెంటివ్ హెల్త్ సీఈవో డాక్టర్ సత్యశ్రీరామ్ మాట్లాడుతూ 40 ఏండ్లు పైబడిన మహిళలకు రెగ్యులర్గా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ను నిర్వహించాలని గ్లోబల్ మార్గదర్శకాలు సూచిస్తున్నట్లు తెలిపారు. అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్-రొమ్ము క్యాన్సర్ నిపుణురాలు, ఆంకోప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ మంజులరావు మాట్లాడుతూ పశ్చిమ దేశాలతో పోలిస్తే మనదేశంలో రొమ్ము క్యాన్సర్ మరణాలు పెరిగాయని పేర్కొన్నారు. ముందస్తుగా గుర్తిస్తే వ్యాధిని నివారించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.