బంజారాహిల్స్,అక్టోబర్ 30: బంజారాహిల్స్లోని డీఏవీ స్కూల్లో బాలికపై జరిగిన లైంగికదాడి ఘటనలో నిందితులను పోలీసులు రెండో రోజు విచారించారు. ఈ వ్యవహారంపై ఈ నెల 17న కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు రజినీకుమార్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాధవిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితులిద్దరిని కోర్టు అనుమతితో శనివారం కస్టడీకి తీసుకున్న పోలీసులు రెండు రోజైన ఆదివారం విచారించారు. ఈ కేసుకు సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలపై ప్రశ్నించారు.
పాఠశాలలో ప్రధాన నిందితుడి తీరు.. సంఘటన జరిగిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై ప్రశ్నించారు. బాలిక పట్ల ప్రధాన నిందితుడు వ్యవహరించిన తీరుపై కూడా ప్రశ్నించి కొంత సమాచారం రాబట్టినట్టు తెలిసింది. ప్రధానంగా డ్రైవర్గా పని చేస్తున్న ప్రధాన నిందితుడు డిజిటల్ రూమ్లోకి వెళ్లడానికి గల కారణాలపై పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. దర్యాప్తులో భాగంగా లైంగికదాడి ఘటనకు సంబంధించిన మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు సోమవారం పాఠశాలకు వెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.