Hyderabad | మణికొండ/బండ్లగూడ, జూలై 4: మార్నింగ్ వాకింగ్కు బయలు దేరిన తల్లీ కుతురిని మృత్యువు రూపంలో దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్ షా కోట్ లక్ష్మీనర్సింహ కాలనీకి చెందిన అనురాధ (38) ఆమె కూతురు మమత (26)తోపాటు పక్కింట్లో ఉంటున్న కవిత రోజువారీ మాదిరిగానే మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో వాకింగ్కు బయలుదేరారు.
వీరు రఘురాంనగర్ కాలనీలో ఉన్న ఆర్మీ గేటు ముందు నుంచి వాకింగ్ చేస్తూ వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో తల్లి అనురాధ, కూతురు మమత అక్కడికక్కడే మృతి చెందారు. కవితకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. గాయాలైన కవితను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడే పడి ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ, మేయర్
ప్రమాదస్థలాన్ని నార్సింగి ఏసీపీ రమణగౌడ్, మేయర్ మహేందర్గౌడ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అక్కడి పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మహేందర్గౌడ్ మాట్లాడుతూ.. ఉదయం సమయంలో వాకింగ్ చేసేవారి కోసం కార్పొరేషన్ పరిధిలో అనేక పార్కులు ఉన్నాయని, పార్కులకు వెళ్లి వాకింగ్ చేయాలని కోరారు. కాలనీల్లో కూడా వాకింగ్ చేయవచ్చని ప్రజలకు సూచించారు.
ఇద్దరి మృతి కారణమైన యువకుడి అరెస్ట్
నిర్లక్ష్యంగా కారు నడిపి తల్లీ కూతురు మృతికి కారణమైన యువకుడిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం బండ్లగూడ జాగీర్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతురు మృతికి కారణమైన మహమ్మద్ బద్రుద్దీన్ ఖాదీర్ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
ఒకరి పుట్టిన రోజు.. ఇద్దరు బలి
మాసాబ్ట్యాంక్ శాంతినగర్కు చెందిన మహమ్మద్ బద్రుద్దీన్ ఖాదీర్(19) మంగళవారం తన పట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు మొయినాబాద్లోని ఓ ఫాంహౌజ్కు ఉదయం తన స్నేహితులతో కలిసి బయలు దేరాడు. సన్సిటీ వద్దకు రాగానే కారు అతివేగంతో నడపడంతో అదుపు తప్పి ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు తెలిపారు. బద్రుద్దీన్కు లైసెన్స్ కూడా లేదన్నారు. కారు యజమాని రెహమాన్పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రమాదానికి కారణమైన యువకుడితోపాటు అతడి తల్లిదండ్రులను కూడా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.