జనగామ, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): పాదయాత్ర పేరిటతో జనగామ జిల్లాలో అడుగుపెట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. బౌన్సర్లు, గుండాలు, రౌడీమూకతో ప్రజలపై దండయాత్ర చేపట్టారు. తెలంగాణకు మీరేం చేశారో చెప్పండి? అని ప్రశ్నించినందుకు టీఆర్ఎస్ శ్రేణులతోపాటు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో పాల్గొన్న సామాన్యులపైనా దాడులకు తెగబడ్డారు.
సోమవారం జనగామ జిల్లా దేవరుప్పులకు పాదయాత్రగా వచ్చిన బండి సంజయ్ తన ప్రసంగంలో ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపై ఇష్టారీతిన మాట్లాడారు. మీరేం చేశారు?, కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలి? అని కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు బండిని నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన బీజేపీ గుండాలు, బౌన్సర్లు.. ఇనుపరాడ్లు, కర్రలు, రాళ్లతో టీఆర్ఎస్ శ్రేణులపై విరుచుకుపడ్డారు.
టీఆర్ఎస్ కార్యకర్తలు పరుగులు తీసినా వెంటపడి విచక్షణారహితంగా కొట్టారు. దాడుల్లో టీఆర్ఎస్ యువజన నాయకుడు కోతి ప్రవీణ్, దివ్యాంగుడైన శ్రీకాంత్, వడ్లకొండ శ్రీకాంత్, రమేశ్ అనే కార్యకర్తలతోపాటు రోడ్డుపై నిల్చున్న సత్తెమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. అడ్డువచ్చిన ప్రజలపై కూడా దాడులు చేశారు. ఓపక్క బండి సంజయ్ మాట్లాడుతుండగా, మరోపక్క బీజేపీ మూకలు వీరంగం సృష్టించాయి. ఆగ్రహించిన స్థానికులు పాదయాత్రలో పాల్గొన్న నాలుగు కార్ల అద్దాలను పగులగొట్టారు.
బండి సంజయ్ వెంట వచ్చిన బీజేపీ మహిళా నాయకులు మరింత రెచ్చిపోయి రోడ్డుపై బైఠాయించారు. అదే సమయంలో అటుగా వచ్చిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డిని బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఆయన వెనుదిరిగారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం ఆందోళనకు దిగడంతో దేవరుప్పులలో నాలుగు గంటలపాటు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది.
డీసీపీ సీతారాం నచ్చజెప్పినా బీజేపీ కార్యకర్తలు వినలేదు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. బీజేపీ దాడుల్లో తీవ్రంగా గాయపడి జనగామలోని ఓ ప్రైవేట్ హాస్సిటల్లో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ కార్యకర్తలను పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డి పరామర్శించారు.
వజ్రోత్సవ వేడుకలు జరుపుకొంటున్న తరుణంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సహా సామాన్య ప్రజలపైన బీజేపీ గుండాలతో దాడులు చేయించడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ నాయకుల దాడులను గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ఖండించారు.