అమీర్పేట్, జూన్ 7 : ఈ నెల 20న జరుగనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని పురస్కరించుకుని, వచ్చే భక్తులకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆలయ ఆవరణలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం అమ్మవారి దర్శనానికి 8 లక్షల మంది భక్తులు వచ్చారని, ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నదన్నారు. ఇందుకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై స్థానికులు, భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని భక్తుల కోసం ప్రత్యక్ష ప్రసారం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, అలాగే కల్యాణ వేదిక ప్రాంగణంలో భక్తులు వీక్షించేలా 5 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు జరిగే అమ్మవారి కల్యాణమహోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్ను అందుబాటులో ఉంచడం, శానిటేషన్ సమస్యలు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ సరళతో పాటు పశ్చిమ మండలం డీపీసీ జోయల్ డేవిస్, ట్రాఫిక్ డీసీపీ హెగ్డే, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి, జలమండలి డైరెక్టర్ కృష్ణ, సీజీఎం ఎం.ప్రభు, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ హఫీజ్, ట్రాన్స్కో డీఈ సుధీర్, ఏడీఈ కిశోర్, పలు శాఖల అధికారులు, కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, దేవాలయ చైర్మన్ సాయిగౌడ్, ఈవో ఎస్.అన్నపూర్ణతో పాటు ఆలయ పాలక మండలి సభ్యులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.
శాశ్వత క్యూ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రూ. 10 లక్షలతో చేపట్టిన శాశ్వత కూ లైన్ల నిర్మాణ పనులకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఆలయ చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, ఈవో ఎస్.అన్నపూర్ణ, ఆలయ పాలక మండలి ప్రతినిధులతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శాశ్వత నిర్మించే క్యూ లైన్ల ద్వారా ఏకకాలంలో దాదాపు 5 వేల మంది క్యూలో ఉండే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే భక్తుల తాకిడి గణనీయంగా పెరిగిందని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, ఆలయాన్ని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు సంతోష్, సరఫ్, యాదగిరి యాదవ్, దాసోజు పుష్పలత, బీఆర్ఎస్ నాయకులు లలితా గోపీలాల్చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.