సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : బల్దియాలో ప్రోటోకాల్ వివాదం రాజుకుంటున్నది. పార్టీలకు అతీతంగా జీహెచ్ఎంసీ కార్యకలాపాలను ముందుండి నడిపించాల్సిన కమిషనర్ రోనాల్డ్ రాస్.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ.. నిబంధనలను తుంగలో తొక్కుతున్నారంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఆయనపై మండిపడుతున్నారు. ఇప్పటికే పాలకమండలి, స్టాండింగ్ కమిటీ ఎన్నికల విషయంలో కమిషనర్ వైఖరిపై సీఎం రేవంత్రెడ్డికి ఫిర్యాదు చేయగా, వెంటనే కమిషనర్ దిగొచ్చి.. ఈ నెల 19న కౌన్సిల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రెండు అంశాల్లో కమిషనర్ వైఖరి వివాదాస్పదమైంది. ప్రజల సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. పరిష్కారంతో పాటు పురోగతిలో ఉన్న పనులను పరిశీలించేందుకు వివిధ నియోజకవర్గాల్లో కమిషనర్ పర్యటిస్తున్నారు.
అయితే పర్యటనలో స్థానిక ఎమ్మెల్యేలకు కనీస సమాచారం లేకుండా నియోజకవర్గాల్లో కమిషనర్ వచ్చి వెళ్లడం ఎంత వరకు సమంజసమని పలువురు మండిపడుతున్నారు. నియోజకవర్గ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేలకు పూర్తి అవగాహన ఉంటుందని, పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనుల్లో కమిషనర్ భాగస్వామ్యం చేసుకోవాలని సూచిస్తున్నారు. జూబ్లీహిల్స్, ఎల్బీనగర్లో కమిషనర్ పర్యటన తర్వాత ఈ చర్చ తీవ్రరూపం దాల్చింది. ఇదే క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న జోనల్ సమీక్షలు చర్చనీయాంశంగా మారాయి. జోనల్ కమిషనర్లు గడిచిన కొన్ని రోజులుగా ఆయా జోనల్ పరిధిలో ఉన్న కార్పొరేటర్లతో కలిసి సమీక్షలు జరుపుతున్నారు.
ఇందులోనూ ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం ఉన్నది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్కు ముందస్తు సమాచారం ఇచ్చి వారి అధ్యక్షతన జోనల్ సమీక్షలు జరపాలి. కానీ ఇందుకు విరుద్ధంగా ప్రక్రియ సాగుతున్నది. ఇప్పటికే శేరిలింగంపల్లిలో మేయర్కు కనీస సమాచారం ఇవ్వకుండా కార్పొరేటర్లతో జోనల్ కమిషనర్ సమీక్షలు జరిపారు. బుధవారం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ సైతం డివిజన్ కార్పొరేటర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలను కమిషనర్ ఆదేశాల మేరకు జరుపుతున్నామని జోనల్ కమిషనర్లు చెబుతున్నారు. ఈ విషయంపై మేయర్ స్పందించి కమిషనర్ను వివరణ కోరారు. స్పెషల్ ఆఫీసర్ పాలన తరహాలో కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ..ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పట్ల ఆయన వైఖరి సరిగా లేదంటూ.. పలువురు పేర్కొంటున్నారు.