సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): అనేక సమస్యలకు పరిష్కార వేదికగా నిలిచే ప్రజావాణి కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ నిర్ణయించారు. ప్రతి సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించి.. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2020 సంవత్సరం కరోనా సమయంలో ప్రజావాణి నిలిపివేశారు.
వార్డు కార్యాలయాలు, కాల్సెంటర్ 040-2111 1111ల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ఎక్కువ శాతం డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆస్తిపన్ను, అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి మళ్లీ నిర్వహించి, ఆయా సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను వారానికో.. రెండు వారాలతో పరిష్కరించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల చివరి సోమవారం కానీ వచ్చే ఏడాది జనవరి నెల నుంచి ప్రజావాణి అమలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే కమిషనర్ రోనాల్డ్రాస్ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.