దుండిగల్, ఏప్రిల్ 22: ఆన్లైన్ యాప్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరంపై బాలానగర్ ఎస్వోటీ , బాచుపల్లి పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. ముగ్గురు నిందితులతో పాటు రూ.22.50 లక్షలతో పాటు రూ.50 వేలు విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం బాచుపల్లి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. ఏపీలోని యనమల కదురు(విజయవాడ)కు చెందిన నవదు గణేశ్కుమార్(35) ఐటీ ఉద్యోగి. మొదట్లో భద్రాచలంలో ఉండే వాడు. తర్వాత తన మాకాంను నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి,ప్రగతినగర్కు మార్చాడు. కృష్ణాజిల్లాలోని గుడివాడకు చెందిన బొరపారెడ్డి శ్రీనివాస్రావు(33) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ప్రగతినగర్లోని కేఎస్ఆర్ క్లాసిక్ అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. అదే అపార్ట్మెంట్లో ఫ్లాట్నంబర్ 401లో నివాసముంటున్న ఎలక్ట్రీషియన్ సొర్ల రాంబాబు(33) ఒక ముఠాగా ఏర్పడి… రాంబాబు ఫ్లాట్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్-చైన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్పై బెట్టింగ్ జరుగుతున్నట్లు బాలానగర్ ఎస్వోటీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వారు బాచుపల్లి పోలీసులతో కలిసి సదరు ఫ్లాట్పై దాడులు నిర్వహించారు. పోలీసుల దాడుల్లో ముగ్గురు బుకీలు పట్టుబడ్డారు. వీరిలో గణేశ్కుమార్ నిర్వాహకుడు కాగా శ్రీనివాసరావు అకౌటెంట్, రాంబాబు కంప్యూటర్ ఆపరేటర్. వీరి నుంచి రూ.22లక్షల 50 వేల 380 నగదుతో పాటు బ్యాంక్ అకౌంట్లో జమచేసిన రూ.2లక్షల 20వేలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బెట్టింగ్కు వినియోగిస్తున్న రెండు ల్యాప్ట్యాప్లు, ఇతర సామగ్రి, మొబైల్ ఫోన్లు,ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా మరో ముగ్గురు ప్రధాన బుకీలు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఆన్లైన్ యాప్ల ద్వారా ఔత్సాహికుల నుంచి బుకీలు బెట్టింగ్ నిర్వహించారు. బెట్టింగ్ రాయుళ్లు కాచే డబ్బులను నేరుగా బుకీల అకౌంట్లలో ఆన్లైన్ ద్వారా జమ చేస్తారు. ఒక వేళ ఎవరైనా డబ్బులు గెలుచుకుంటే మాత్రం వారికి నేరుగా ఫోన్ చేసి, తాము చెప్పిన చోటుకు రప్పించుకుని అందజేస్తారు.
బెట్టింగ్ నిర్వాహకులు ప్రధానంగా మొబైల్ ఆన్లైన్ యాప్ల ద్వారా అక్రమ దందా నిర్వహిస్తున్నారని ఏసీపీ తెలిపారు. ఆన్లైన్ యాప్లతో యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం అందితే 94906 17444 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. కాగా క్రికెట్బెట్టింగ్ స్థావరం గుట్టు రట్టు చేసిన బాలానగర్ జోన్ ఎస్వోటీ పోలీసులతో పాటు బాచుపల్లి పోలీసులను ఏసీపీ అభినందించారు.