Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరం అద్భుత నిర్మాణాలకు నిలయాలుగా మారుతున్నది. ఇప్పటికే మెట్రో, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఐకానిక్ నిర్మాణాలుగా చెరగని ముద్ర వేసుకున్నాయి. ఎస్ఆర్డీపీ పథకంలో 47 ప్రాజెక్టుల్లో 34 ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో ఉప్పల్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ జంక్షన్ల మీదుగా చేపట్టిన సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్లు ప్రత్యేకతలు సంతరించుకోగా..తాజాగా బైరామల్గూడ సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్తో పాటు రెండు లూప్లు సైతం ప్రత్యేక నిర్మాణాలుగా నిలవనున్నాయి. ఔటర్ రింగు రోడ్డు తరహాలో బైరామల్గూడలో లూప్లు రావడం ఎస్ఆర్డీపీలో తొలి నిర్మాణంగా చెప్పుకోవచ్చు. ఎల్బీనగర్, చంపాపేట, సాగర్ రింగు రోడ్డు మార్గాల వైపు వెళ్లేందుకుగానూ ఈ లూప్లు ఎంతగానో దోహదపడనున్నాయి.
రూ. 134.25 కోట్లతో బైరామల్గూడ సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్, బైరామల్గూడ ఎల్హెచ్ఎస్ లూప్ రూ. 21.63 కోట్లు, బైరామల్గూడ ఆర్హెచ్ఎస్ లూప్ రూ.22.30కోట్లతో నిర్మాణం జరుగుతుంది. లూప్లు, సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్లు వచ్చే సెప్టెంబరు నెలాఖరు నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు పేర్కొన్నారు. బైరామల్గూడలో రెండు ఫ్లై ఓవర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ నుంచి కర్మన్ఘాట్ వైపునకు వెళ్లే వాహనాలకు, అటు నుంచి ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకునే వారికి బైరామల్గూడ చౌరస్తాలో ఫ్లై ఓవర్లు (ఆర్హెచ్ఎస్/ఎల్హెచ్ఎస్) పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చింది.
ఈ క్రమంలోనే చాంద్రాయణగుట్ట ఓవైసీ దవాఖాన, కర్మన్ఘాట్ వైపు నుంచి బైరామల్గూడ చౌరస్తాలో ఆగకుండా చింతలకుంట చెక్పోస్టు, గుర్రంగూడ వైపు సాగర్ రోడ్డుకు చేరుకునేలా ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతున్నది. ఇది సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్. ఇప్పుడున్న ఫ్లై ఓవర్ పై నుంచి సాగిపోతుంది. కర్మన్ఘాట్ రోడ్డు నుంచి మూడు లేన్లతో మొదలై చౌరస్తా వద్ద ఆంగ్ల అక్షరం ‘వై’ అకారంలో రెండు వైపులా విడిపోతుంది. చింతలకుంట చెక్పోస్టు రోడ్డుపైకి, మరొకటి సాగర్ రోడ్డుపైకి వాహనాలు వెళ్లనున్నాయి. ఎల్బీనగర్ నుంచి చంపాపేటకు, సాగర్ రింగు రోడ్డు నుంచి ఎల్బీనగర్కు వెళ్లాలంటే చౌరస్తా వద్ద ఆగక తప్పడం లేదు. దీనికి పరిష్కారంగా రెండు లూప్లను నిర్మిస్తున్నారు.
సాగర్ రింగు రోడ్డు నుంచి ఎల్బీనగర్ వెళ్లే వాహనాలు చౌరస్తా వద్ద ఆగి, గ్రీన్ లైట్ వెలిగాక కుడివైపునకు వెళ్లాలి. ఇక మీదట ఆగకుండా వెళ్లేలా సాగర్ రింగు రోడ్డు నుంచి వచ్చే వాహనాలను చంపాపేట రోడ్డు వైపునకు తీసుకెళ్లి ఎడమవైపునకు మళ్లించి, అప్(ఎగువ) ర్యాంపు ద్వారా కర్మన్ ఘాట్ -ఎల్బీనగర్ ఫ్లై ఓవర్కు సదరు వాహనాలను చేర్చనున్నారు.
ఎల్బీనగర్ నుంచి చంపాపేట వెళ్లే వాహనాలు చౌరస్తా వద్ద ఆగి కుడివైపునకు మళ్లాల్సి ఉండేది. అలాంటిదేమి లేకుండా ఎల్బీనగర్-కర్మన్ఘాట్ ఫ్లై ఓవర్ పైకి వాహనాన్ని తీసుకువెళ్లి, చౌరస్తా అవతల ఉండే డౌన్ (దిగువ) ర్యాంపు మీదుగా సాగర్ రోడ్డు నుంచి చంపాపేట వైపు వెళ్లే రోడ్డుకు అనుసంధానం చేయనున్నారు.