బడంగ్పేట్, ఏప్రిల్23: బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన అవినీతి అక్రమాల పై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చూడాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గురువారం లేఖ రాశారు. బడంగ్పేట్లో జరిగిన నిధుల దుర్వినియోగం, అవినీతి అక్రమాలకు పాల్పడిన పది మంది అధికారులను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అవినీతిని కూకటి వేళ్లతో పెలికిలించాలన్నారు. లోతైన విచారణ జరిపించాలని మీ దృష్టికి తీసుకొస్తున్నట్లు చెప్పారు.
ప్రజల సొమ్మును కాజేసిన వారి పై చర్యలు తీసుకోవాలని కోరారు. జలవనరుల పరిరక్షణకు ఎఫ్టీఎల్, బఫర్లను గుర్తించాలన్నారు. నాలాలను కబ్జా చేసిన రియల్ట్ర్లపై , వెంచర్ చేసిన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. కబ్జా చేసిన నాలాలను పునరుద్ధరించాలన్నారు. చెరువుల్లో, ఎఫ్టీఎల్ పరిధిలో అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలన్నారు. ఒక ప్లాట్ కు ఏకంగా పది ఇంటి అనుమతులు ఇచ్చిన విషయాన్ని ఆమె లేఖలో ప్రస్తావించారు.
పాత గ్రామ పంచాయతీ వెంచర్లలో అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే లేఖలో కోరారు. 2013లో గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా ఏర్పాటు అయిన్నప్పటి నుంచి గ్రామ సర్పంచ్ల పేర్లతో అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. కార్పొరేషన్ అయిన తర్వాత కూడా సర్పంచ్ల పేరుతో ఇచ్చిన అనుమతుల పై విచారణ జరిపించాలని పేర్కొన్నారు.
అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్ల నుంచి ప్రజాధనాన్ని రికవరీ చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. ప్రభుత్వ నిధులతో ప్రైవేట్ వెంచర్లో చేసిన అభివృద్ధి పనులకు అయిన ఖర్చు రికవరీ చేయాలన్నారు. సాంక్షన్ అయి పనులు కాకపోతే వెంచర్ ఓనర్ పై కేసు నమోదు చేయించాలన్నారు. కార్యాలయంలో ఫైల్స్ మాయం చేసిన సూత్ర దారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. చెరువుల సుందరీకరణ విషయంలో కూడా విచారణ జరిపించాలన్నారు.
అవినీతి అక్రమాల్లో కింది స్థాయి అధికారులను కాకుండా వెనుక ఉండి ప్రోత్సహించిన అదృశ్య శక్తుల పై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిధులను, ప్రభుత్వ భూములను కాపాడటంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించే విధంగా చూడాలన్నారు. ఉన్నత అధికారుల ద్వారా కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.