సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): నూతన చట్టాలపై పోలీసు సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని రాచకొండ సీపీ తరుణ్ జోషీ అన్నారు. జూలై 1 నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు – 2023 అమలులోకి తేనున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలన్నారు. ఇందులో భాగంగా సిబ్బందికి అవగాహన కల్పించేలా శిక్షణ కార్యక్రమాన్ని న్యాయ నిపుణులతో నిర్వహించారు. మాజీ పీపీ రాములు నూతన చట్టాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. భారత న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదనీ, అవసరాన్ని బట్టి ప్రజా భద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన జరిగిందన్నారు. ఇప్పుడు అమలులోకి రానున్న నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం వంటి అంశాలతో శాంతిభద్రతల పరిరక్షణలో మైలురాయిగా నిలుస్తోందన్నారు. నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలు దొరుకుతుందన్నారు. ప్రతి ఒక్కొరూ నూతన అంశాలను నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి, ఏసీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.