సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ నిరంకుశ విధానాలు నశించాలి.. డ్రైవరన్నల ఆత్మహత్యలపై స్పందించని కాంగ్రెస్ను ఓడించాలి.. తెలంగాణపై విషం చిమ్ముతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్, బీజేపీ ఓటమియే ఎజెండాగా పనిచేస్తాం..’ అంటూ నినదిస్తూ.. ఆటో డ్రైవర్లు కదం తొక్కారు. తమ జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లోక్సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీల ఓటమియే లక్ష్యంగా చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆటో డ్రైవర్లు.. బీఆర్ఎస్ను బంపర్ మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు.
ఈ సందర్భంగా టీఏటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. తెలంగాణలో ఆటో డ్రైవర్లు సుమారు 25 మందికిపైగా మరణించినా.. పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడూ తాము రోడ్డు ఎక్కే దుస్థితి రాలేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి.. కాంగ్రెస్, బీజేపీ నాయకుల చెంప చెల్లుమనిపిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లలంతా లోక్సభ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని వివరించారు.
గ్రేటర్లో చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరిలో ప్రచారం నిర్వహించామని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ ఆటో యూనియన్ అధ్యక్షుడు పోలె నీరంజన్ మాట్లాడుతూ.. కరోనా వంటి క్లిష్ట సమయంలో ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో ఆటోడ్రైవర్లు కొట్టుమిట్టాడుతుంటే.. కేసీఆర్ సర్కార్ వాహన మోటార్ పన్ను రద్దు చేసి అండగా నిలిచిందని గుర్తు చేశారు. కరోనా సమయం రెండు త్రైమాసికాల పన్ను రద్దు చేసి కార్మికులకు భరోసాగా ఉందని వివరించారు. ఆటో డ్రైవర్లకు ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించిన ఘనత కేసీఆర్ సర్కార్దేనని అన్నారు.
అప్పటి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో జేఎన్ఎన్యూఆర్ఎం స్కీంలో భాగంగా సంగారెడ్డి అమీన్పూర్లో 400 మంది ఆటో డ్రైవర్లకు ఇండ్లు కేటాయించుకోగలిగామని చెప్పారు. ఆటో డ్రైవర్ శాతం రమేశ్ మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేసేదే లేదని అంటున్నారన్నారు. ఎక్కడ చూసినా కేసీఆర్ మళ్లీ రావాలి అని జనం కోరుకుంటున్నారని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో దాసు, చంద్రమౌళి, రమేశ్, నీజర్, సిద్దులు, కమ్మర్, శీను, జావేద్ తదితరులు ఉన్నారు.
ఆటో డ్రైవర్ల సూసైడ్ రిపోర్ట్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఉచిత బస్సు స్కీంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల వివరాలతో ‘ ఆటో డ్రైవర్ల సూసైడ్ రిపోర్ట్’ సోషల్ మీడియాలో విరివిగా వైరల్ అవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం స్కీం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 25 మందికి పైగా ఆటో డ్రైవర్లు చనిపోయారంటూ లిస్ట్ను షేర్ చేస్తున్నారు. ఆ లిస్ట్కు పేపర్ క్లిప్పింగ్స్, టీవీ చానెళ్ల వీడియోలు జత చేస్తూ ఆధారాలతో షేర్ చేస్తున్నారు.