సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) ; మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరిట ప్రభుత్వం తమ పొట్టకొట్టొదంటూ మణికొండ మున్సిపాలిటీ మర్రిచెట్టు చౌరస్తాలో సోమవారం ఆటోడ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో రాస్తారోకోను నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు గంటపాటు రోడ్డును దిగ్బంధం చేసి సర్కారుకు వ్యతిరేక నినాదాలను చేశారు. అడ్డుగా వచ్చిన బస్సులను అడ్డుకుని నిలిపివేశారు. తాము జీవనోపాధి కోసం అహర్నిశలు శ్రమిస్తే కానీ మా కడుపులు నిండని పరిస్థితులున్నాయని, ఇప్పుడు కొత్త సర్కారు కొలువు దీరిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమ బతుకులు దయనీయస్థితికి చేరుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటోడ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకుని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమకు ఉపాధి కల్పించాలని ఆటోడ్రైవర్లు కోరారు. ఆటోల్లో అధిక శాతం మహిళలే ప్రయాణించే వారని, వారికే బస్సు టికెట్టు ఫ్రీ అని సర్కారు ప్రకటించడంతో తమకు ఉపాధి కరువైందని వారు ఆరోపించారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి తమ జీవనోపాధిపై చొరవ చూపాలని విజ్ఞప్తిచేశారు.
15 వేలు చెల్లించాలి
రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు అందరూ రోడ్డున పడ్డారని, వారిని ప్రభుత్వమే అదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. ఆరాంఘర్ చౌరస్తాలో ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జైపాల్రెడ్డి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడంతో ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండి పడిందని అవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు మేలు జరుగుతుందని అనుకున్నామని, కానీ ఈ ప్రభుత్వం తమ ఆశలను నిరాశ చేసిందని వాపోయారు. వెంటనే ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి నేలకు 15వేల రూపాయలను అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిరంజన్, నరేందర్రెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి ;బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నందకిశోర్
ఆటో డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చింతల నందకిశోర్ డిమాండ్ చేశారు. సోమవారం శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట శంషాబాద్ ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నందకిశోర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడంతో ఆటోలను ఎవరూ ఆశ్రయించడంలేదని తెలిపారు. ఆటో డ్రైవర్లు రోజు వారి గిరాకీ లేక కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఆటో ఈఎంఐలతో పాటు పిల్లల చదువులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు రోజుకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.