మాదాపూర్ : మద్యం సేవిస్తున్న నలుగురు స్నేహితుల మధ్య వివాదం చెలరేగడంతో అందులో ఓ యువకుడు తన స్నేహితునిపై బీర్ బాటిల్తో దాడి చేశాడు. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సుఖెందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం … మాదాపూర్లోని ఖానామెట్కు చెందిన గుర్రం డేవిడ్ (21) ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ నెల 8న సాయంత్రం సమయంలో సిద్ధిక్నగర్కు చెందిన తన స్నేహితులు కార్తీక్ (22), హర్షద్ (23), సన్నీ (21)లతో కలిసి మాదాపూర్లోని ఓ వైన్ షాపులో మద్యం సేవిస్తున్నారు. ఇటీవల నలుగురి మధ్య పాత గొడవలు నడుస్తుండటంతో మద్యం సేవిస్తూ మాట మాట పెరిగి పక్కనే ఉన్న బీర్ బాటిల్ను తీసుకొని నలుగురిలో ఓ స్నేహితుడు డేవిడ్ కడుపులో పొడిచాడు.
పొట్ట భాగంలో స్వల్ప గాయం అయింది. దీంతో డేవిడ్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందివ్వగా డేవిడ్ అన్న జాన్ సంఘటన స్థలానికి చేరుకొని కొండాపూర్లోని ఏరియా దవాఖానాకు తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా దవాఖానాకు తరలించారు. ముగ్గురిలో దాడి చేసిందేవరన్న విషయం తెలియక పోవడంతో ముగ్గురిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.