అమీర్పేట్, మార్చి 29 : నలు దిశలా బీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతున్నది. గ్రేటర్లో జోరుగా ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. రెట్టించిన ఉత్సాహంతో గులాబీ శ్రేణులు ఇందులో భాగస్వాములవుతున్నారు. నగరవ్యాప్తంగా బుధవారం ఐదు చోట్ల ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. జల్పల్లిలో సబితా ఇంద్రారెడ్డి, సనత్నగర్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, సీతాఫల్మండిలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మాదాపూర్లో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, కర్మన్ఘాట్లో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. మూడోసారి హ్యాట్రిక్ సాధించేలా కృషి చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మతవిద్వేషాలు రగిలించే బీజేపీని నమ్మి మోసపోవద్దని ప్రజలకు హితవుపలికారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు చిల్లర మల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సబ్బండ వర్ణాల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని, పేదల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు రూపుదిద్దుకోనున్నాయని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. బుధవారం సనత్నగర్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం లింగయ్యనగర్లోని ఏకేగౌడ్ ఫంక్షన్ హాలులో జరిగింది. బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్, కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారితో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు వీలుగా రూ. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కార్ బడులు సరికొత్త రూపు సంతరించుకున్నాయని చెప్పారు. ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన తరువాతే తమ పిల్లల చదువుల విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నారు.
కార్పొరేట్కు దీటుగా సర్కారు బడులు
బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేద్దామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం జల్పల్లి మున్సిపల్ పరిధి శ్రీరామకాలనీలోని విజయలక్ష్మి గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పూలవర్షం కురిపిస్తూ డప్పువాయిద్యాలతో బీఆర్ఎస్ నాయకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. రెండు మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా, మండుటెండలో శ్రీరామకాలనీలో కిలోమీటరు వరకు పాదయాత్ర నిర్వహించారు. భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విద్యారంగానికి సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి గురుకులాలను నిర్మించడంతో పాటు ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు సమకూరాయన్నారు.
కార్పొరేట్ స్థాయికి దీటుగా సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సబ్బండ వర్గాలను ఆదుకుంటుందన్నారు. మోదీ ప్రభుత్వం పేదోడి కడుపుకొట్టి.. బడా బాబుల జేబులు నింపుతున్నదని విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, సీఎంగా కేసీఆర్ ఉండడం మన అదృష్టమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గతంలో మంత్రి కేటీఆర్ రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారన్నారు. అభివృద్ధి పనుల్లో జాప్యం చేయవద్దని కౌన్సిలర్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, శంకర్, భాషమ్మ, శంషొద్దీన్, నాయకులు జనార్దన్, నిరంజన్, ఖైసర్బామ్, రాములు, సుభాష్ కుర్మ, దామోదర్రెడ్డి, కొండల్ యాదవ్, సాంబశివ, సుధాకర్గౌడ్, శ్రీనివాస్గౌడ్, పద్మ, యాస్మిన్ బేగం, ఫిరోజ్, బర్కత్ అలీ, మన్నన్ తదితరులు పాల్గొన్నారు.
సబ్బండ వర్ణాల సంక్షేమమే బీఆర్ఎస్ ఎజెండా
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 29: రాష్ట్రంలో సబ్బండ వర్ణాల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం, బీఆర్ఎస్ ఎజెండా అని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్మండి డివిజన్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు, హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్, సికింద్రాబాద్ పార్లమెంటరీ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ హాజరయ్యారు. సమ్మేళనానికి ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
సమ్మేళనంలో పద్మారావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను కలుపుకునిపోతూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని కొనియాడారు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కార్యకర్తల శ్రమ, కృషిని విస్మరించబోమని అన్నారు.
హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్ మాట్లాడుతూ దేశానికే తెలంగాణ రాష్ట్రం తలమానికంగా నిలుస్తోందని అన్నారు. ప్రతిపక్షాలు కేవలం ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయని మండిపడ్డారు. సికింద్రాబాద్ నియోజకవర్గం చిరకాలంగా తెలంగాణవాదానికి కంచుకోటగా నిలిచిందని గుర్తు చేశారు. తలసాని సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ తన సత్తాను చాటుకుంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, లింగాని ప్రసన్నలక్ష్మి, బీఆర్ఎస్ యువనేతలు తీగుళ్ల కిశోర్కుమార్, రామేశ్వర్గౌడ్, నాయకులు కరాటే రాజు, లింగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సిరాజుద్దీన్ మృతి తీరని లోటు తలసాని సాయికిరణ్ యాదవ్
బీఆర్ఎస్ మైనార్టీ విభాగం సీనియర్ నాయకులు సయ్యద్ సిరాజుద్దీన్ మృతి పార్టీకి తీరని లోటని తలసాని సాయికరణ్యాదవ్ పేర్కొన్నారు. పార్టీ తరపున ఎటువంటి బాధ్యతలు అప్పగించినా అంకిత భావంతో పూర్తి చేసే సయ్యద్ సిరాజుద్దీన్ మృతి బాధాకరమన్నారు. సిరాజుద్దీన్ స్థానంలో సనత్నగర్ జామా మసీదు జాఫ్రీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సయ్యద్ నొమానుద్దీన్కు ధైర్యం చెబుతూ వారి కుటుంబానికి పార్టీ బాసటగా నిలుస్తుందన్నారు.
కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష దాసోజు శ్రవణ్కుమార్,హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని గుప్పిస్తున్నాయని, ఇటువంటి శక్తులను గులాబీ శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు కేసీఆర్ పాలన శ్రీరామ రక్షగా ఉందన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలో శీనన్నను మరోసారి గెలిపించుకుని మంత్రిగా సేవలందించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. బీజేపీ నాయకులెవరైనా వస్తే పెరిగిన గ్యాస్ సిలిండర్, నిత్యావసర వస్తువుల ధరలతో పాటు బీఆర్ఎస్ నేతలపై బనాయిస్తున్న తప్పుడు కేసులపై నిలదీయాలని పిలుపునిచ్చారు.
మంత్రి ప్రేమతోనే బీఆర్ఎస్లోకి..
కరోనా కష్టకాలంలో నియోజకవర్గంలోని వయోధికుల మంచి చెడ్డలను మంత్రి తలసాని ఎంతో బాధ్యతగా కనిపెట్టుకున్నారు. వయోధికులు బయటకు వెళ్లకుండా నిత్యం జాగ్రత్తలు చెబుతూ, ఎవరికి ఎటువంటి అవసరాలున్నా వాటిని పరిష్కరించడం, వైద్య సహాయాలు అందించడంతో మంత్రి మాకు కుటుంబ సభ్యుడిగా మారిపోయారు. ఆ ప్రేమే మమ్మల్ని బీఆర్ఎస్ కండువా కప్పుకునేలా చేసింది.
– డి.పార్థసారధి, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి, ఎస్ఆర్నగర్
హై టెన్షన్ బాధను తొలగించారు..
సుభాష్నగర్లో హై టెన్షన్ విద్యుత్ తీగల కారణంగా బస్తీ వాసులకు నిద్రలేని రాత్రుళ్లు గడిపేలా చేసింది. ఇళ్ల పై నుంచి వెళుతున్న విద్యుత్ తీగలను మంత్రి తలసాని చొరవతో పూర్తిగా తొలగిపోయింది. సంక్రాతి పండుగ వచ్చిందంటే పిల్లలు ఎప్పుడు తీగల బారన పడతారోననే భయం ఇక లేకుండా చేశారు. ఇప్పుడు సుభాష్నగర్ ప్రశాంతంగా నిద్రపోతోంది.
– దాసోజు పుష్పలత, సుభాష్నగర్