కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ ఏటీఎం వద్ద జరిగిన కాల్పుల ఘటనలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటన జరిగిన వెంటనే 12 బృందాలను రంగంలోకి దించారు.. ఈ దోపిడీ దొంగలు బిహార్ లేదా రాజస్థాన్కు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. ఇందుకు వారం రోజుల సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దుండగులు వాడిన బైక్కు నంబర్ ప్లేట్ లేకపోవడంతో దర్యాప్తులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. ఈ తరహానేర ప్రకియలో ఉన్న పాతనేరస్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. అయితే.. డబ్బుల వ్యాన్కు 74 ఏండ్ల వృద్ధుడిని సెక్యూరిటీ గార్డుగా పెట్టుకోవడంతో సదరు ఏజెన్సీపై సైబరాబాద్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏటీఎం వద్ద జరిగిన దోపిడీ ఘటనలో సైబరాబాద్ పోలీసులు వారం రోజుల సీసీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నా రు. ఇందులో లభ్యమైన దృశ్యాలను బిహార్, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇతర ఉత్తరాది రాష్ర్టాలకు పంపారు. మరో వైపు కాల్డాటాను విశ్లేషిస్తున్నారు. దుండగులు ఉపయోగించిన బైక్పై ఆరా తీస్తున్నారు. దోపిడీకి రెండు, మూడు రోజుల నుంచి రెక్కీ చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. బేగంపేటలోని ‘రైటర్స్ సేఫ్ గార్డు ఏజెన్సీ’ ప్రాంతం నుంచి.. ఘటన జరిగిన పటేల్కుంట ప్రాంతం వరకు ఎవరైనా నిరంతరంగా ఫాలో అయ్యారా అని.. వారం రోజుల సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అదే విధంగా ఆ సమయంలో అక్కడ ఒకే నంబర్తో ఎవరైనా ఫోన్ మాట్లాడారా? అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు.. దోపిడీకి పాల్పడిన ఇద్దరితోపాటు మరికొంత మంది ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ బైక్ను ఇక్కడ కొనుగోలు చేశా రా? లేదా వారి రాష్ట్రం నుంచే తీసుకొచ్చారా? దోపిడీదారులకు నగరంలో ఎవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
బేగంపేట నుంచి రైటర్స్ సేఫ్ గార్డు ఏజెన్సీ దాదాపు రూ.2.07 కోట్లు తీసుకుని ఏటీఎం కేంద్రాల్లో జమ చేసేందుకు ముందుగా కూకట్పల్లికి బయలుదేరారు. అక్కడ రూ.12 లక్షలను డిపాజిట్ చేశారు. ఆ తర్వాత రూ.11 లక్షలను పటేల్కుంట హెచ్డీఎఫ్సీ ఏటీఎం కేంద్రంలో డిపాజిట్ చేసేందుకు బయలుదేరారు. అక్కడ సిబ్బంది 11 లక్షలను ఏటీఎంలో డిపాజిట్ చేయడానికి వెళ్లగా.. బయట వ్యాన్ వద్ద సెక్యూరిటీగార్డు ఉన్నాడు. అతడిపై దుండగులు కాల్పులు జరిపి రూ.5 లక్షలను ఎత్తుకెళ్లారు. ఇంకా రూ.1.84 కోట్లు వ్యాన్లోనే ఉన్నాయని పోలీసులు గుర్తించారు.