సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): లోకసభ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.3.61 లక్షల నగదు, రూ. 49,169 విలువ గల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కమిషనర్ రోనాల్డ్ రాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 179.91 లీటర్ల లిక్కర్ను కూడా సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నగదు, ఇతర వస్తువులపై ఆరు ఫిర్యాదులు రాగా.. వాటిని పరిశీలించి పరిష్కరించినట్లు పేర్కొన్నారు. నలుగురిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, 97 లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ చేసినట్లు వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.3.32 కోట్ల నగదు, కోటి 14 లక్షల రూపాయల విలువ గల ఇతర వస్తువులను కూడా పట్టుకున్నట్లు కమిషనర్ వివరించారు.
మంగళ్హాట్లో.. కోటిన్నర స్వాధీనం
ఎలాంటి పత్రాలు లేకుండా కోటిన్నర రూపాయలు తరలిస్తున్న వాహనాన్ని ఫ్లయింగ్ సర్వేలెన్స్ టీం పట్టుకుని, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సౌత్- వెస్ట్ జోన్ డీసీపీ డి.ఉదయ్కుమార్ రెడ్డి, గోషామహల్ ఏసీపీ కె.వెంకట్రెడ్డి, మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ ఎం.మహేశ్ మంగళ్హాట్ పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించారు. మంగళ్హాట్ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ వాహనంలో ఉన్న మూడు బ్యాగుల్లో భారీ మొత్తంలో నగదు కనిపించింది. వాహనంలో ఉన్న మియాపూర్కు చెందిన రవిచంద్ర, గంగారాం, శ్రీనివాస్ను విచారించగా.. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించలేదు. దీంతో నగదును మంగళ్హాట్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఇది హవాలా డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీజ్ చేసిన కోటిన్నర నగదును ఐటీ శాఖకు అప్పగించనున్నట్లు డీసీపీ తెలిపారు.