ముషీరాబాద్, సెప్టెంబర్ 13: విద్యార్థినుల ఫొటోలు తీస్తూ..అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ కీచక టీచర్ను తల్లిదండ్రులు పోలీసులకు అప్పగించారు. దోమలగూడ గగన్మహల్ ప్రాథమిక పాఠశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్న శ్రీనివాస్ కొన్ని రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా విద్యార్థినులు, తోటి అధ్యాపకుల ఫొటోలు తీసుకొని వెకిలి చేష్టలకు పాల్పడుతున్నాడు. తాను చెప్పినట్లు వినాలంటూ.. విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్నాడు. విసిగిపోయిన పిల్లలు తాము స్కూల్కు వెళ్లమని ఇంట్లోనే ఉంటామంటూ.. ఏడుస్తూ తల్లిదండ్రులకు జరుగుతున్న విషయాలను వివరించారు. దీంతో సోమవారం తల్లిదండ్రులు టీచర్కు బుద్ధి చెబుతామని పాఠశాలకు వెళ్లారు. తీరా శ్రీనివాస్ దివ్యాంగుడని తెలిసి.. ఏమి అనకుండా చిక్కడపల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. అతడిలో మార్పు రాలేదని పలువురు అధ్యాపకులు చెప్పారు. మరోవైపు సదరు అధ్యాపకుడు మాత్రం తాను ఎవరి ఫొటోలు తీయలేదని, అసభ్యకరంగా ప్రవర్తించలేదని చెబుతున్నాడు.