మారేడ్పల్లి, సెప్టెంబర్ 13: రైళ్లు, రైల్వే స్టేషన్లలో మహిళా ప్రయాణికులను టార్గెట్ చేస్తూ.. దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. మీడియా సమావేశంలో రైల్వే ఇన్స్పెక్టర్ ఎం.శ్రీను కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటక కు చెందిన మోతీలాల్ రెడ్డప్ప పవార్ ( 22), సంజయ్ సుభాష్ రాథోడ్ అలియాస్ సంజు (33)కూలీలు. వీరిద్దరూ స్నేహితులు. పుణేలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పనిచేయగా వచ్చే డబ్బులు సరిపోవడంలేదు. సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలు చేయాలని పథకం వేశారు. రైళ్లు, రైల్వే స్టేషన్లను ఎంచుకున్నారు. రైళ్లలో ప్రయాణికుల్లా నటిస్తూ మహిళల మెడల్లో, బ్యాగ్లలో ఉన్న విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్నారు. వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పలువురు బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీ కెమెరాల ద్వారా నిఘాను ముమ్మరం చేశారు. బుధవారం ఉదయం నిందితులిద్దరూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10వ నంబర్ ప్లాట్ ఫారంపై బ్యాగ్లతో అనుమానాస్పదంగా రైల్వే పోలీసులకు కనిపించారు. వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. చేసిన నేరాలను అంగీకరించారు. 11 కేసుల్లో నిందితుల వద్ద నుంచి 309 గ్రాముల బంగారు నగలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రైల్వే పోలీసు సిబ్బందికి తగిన రివార్డు అందజేస్తామని రైల్వే ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో రైల్వే పోలీసు సిబ్బంది సరస్వత్, రవిబాబు, గోవింద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.