సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో డ్రగ్స్ను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు పోలీసులు నిఘా పెంచి, అనుమానితులను తనిఖీలు చేస్తుండటంతో గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్ సరికొత్త తరహాలో ఏపీ నుంచి హైదరాబాద్, మహారాష్ట్రకు మత్తుపదార్థాలను రవాణా చేస్తున్న విషయం బయటపడింది. నాలుగు కిలోమీటర్ల దూరంతో పైలెట్ వాహనం వెళ్తుంటే.. వెనుక నుంచి ముఠా సభ్యులు గంజాయితో వస్తుంటారు. స్మగ్లర్ల ఎత్తును పసిగట్టిన రాచకొండ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు.. రెండు వేర్వేరు గ్యాంగ్లను వెంటాడి పట్టుకున్నారు. ఈ రెండు ఘటనల్లో రూ. 1.15 కోట్ల విలువైన 380 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ సోమవారం ఎల్బీనగర్లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
చౌటుప్పల్లో…
మహబూబాబాద్ జిల్లాకు చెందిన దరావత్ పూల్సింగ్పై గతంలో మూడు ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయి. అతడికి గంజాయి సరఫరాదారులతో మంచి లింకులున్నాయి. ఈ క్రమంలోనే స్థానికులైన ఎండీ గౌస్పాషా, బూక్య భిక్షపతి, షేక్ మొహినుద్దీన్తో ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేశాడు. ఏపీలోని సీలేరులో ఉండే బాలు అలియాస్ బాలేష్ను సంప్రదించారు. మారుతీ స్విఫ్ట్ డిజైర్, టాటా జెస్ట్ కార్లలో అక్కడి నుంచి తిరిగి 5వ తేదీ ఉదయం బయలుదేరారు. ఒక కారు ముందు పైలెట్గా, మరో కారు వెనుక నుంచి వస్తున్నాయి. వీటి మధ్య దూరం నాలుగు కిలోమీటర్లు ఉంది. హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర సోలాపూర్లోని లింబాజి అనే వ్యక్తికి ఈ గంజాయిని సరఫరా చేసేందుకు ఈ ముఠా బయలుదేనింది. ఎస్ఓటీ-1 మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ రాములు బృందం ఈ ముఠాకు సంబంధించిన పక్కా సమాచారం అందుకొని నిఘా వేసింది. పైలెట్ కారుతోపాటు వెనుక సరుకుతో వస్తున్న కార్లను రెండింటిని ఒకేసారి పట్టుకున్నారు. అందులో ఉన్న 160 కిలోల గంజాయితో సహా ప్రధాన నిందితుడు పూల్సింగ్తోపాటు గౌస్, భిక్షపతి, మొహినుద్దీన్లను అరెస్ట్ చేశారు. సీలేరుకు చెందిన బాలేష్తో పాటు మహారాష్ట్రంలో లింబాజీలు పరారీలో ఉన్నారు.
యాచారంలో…
హైదరాబాద్ యాకుత్పురాకు చెందిన మహ్మద్ ఫిరోజ్, కార్వాన్కు చెందిన దినేశ్ సింగ్ పాత నేరస్థులు. వీరిద్దరికీ ఏపీలోని సీలేరులో గంజాయి సరఫరా చేసే వాళ్లతో పరిచయాలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్, మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్ చేసి డబ్పు సంపాదించేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా నగరానికి చెందిన మహ్మద్ ఖాదర్, అబ్దుల్ రవూఫ్, సతీష్తో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేశారు. టాటా ఇన్నోవా, హోండా సిటీ కార్లలో అక్కడకు వెళ్లారు. అక్కడ ముకుంద్ అనే వ్యక్తి వద్ద నుంచి 220 కిలోల గంజాయిని కొనుగోలు చేసి, అక్కడి నుంచి మహారాష్ట్రలోని బుల్దాన సిటీకి రెండు కార్లలో బయలుదేరారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో పైలెట్ వాహనాన్ని నడిపిస్తూ ఎప్పటికప్పుడు పోలీసుల తనిఖీలు, చెక్పోస్టుల గూర్చి గమనిస్తూ వెళ్తున్నారు. విజయవాడ జాతీయ రహదారిపై వస్తే పంతంగి టోల్గేట్ వద్ద రాచకొండ పోలీసుల తనిఖీలు ఉంటాయని, ఆ తనిఖీలను తప్పించుకోవడం కోసం నాగార్జునసాగర్ రూట్లో హైదరాబాద్ వైపు వస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు యాచారం పోలీసుల సహకారంతో యాచారంలోని గుంగల్ క్రాస్రోడ్డులో ఈ రెండు వాహనాలను పట్టుకున్నారు. ఈ కేసులో సీలేరుకు చెందిన ముకుంద్, మహారాష్ట్రకు చెందిన ఠాకూర్ మినహా మిగతా ఐదుగురు నిందితులు అరెస్టయ్యారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ జానకీ దరావత్, మల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీ గిరిధర్, చౌటుప్పల్, యాచారం ఇన్స్పెక్టర్లు దేవేందర్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.